గత ఫలితాలు రిపీట్​ కావొద్దు : మున్షీ

గత ఫలితాలు రిపీట్​ కావొద్దు  : మున్షీ
  •     లోక్​సభ ఎన్నికలకు అందరూ కలిసి పని చేయాలి: మున్షీ
  •     హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల సెగ్మెంట్లపై రివ్యూ 

హైదరాబాద్, వెలుగు :  సికింద్రాబాద్, హైదరాబాద్​ లోక్​సభ సెగ్మెంట్లపై కాంగ్రెస్​పార్టీ దృష్టి సారించింది. ఆ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఫలితాలు దారుణంగా ఉండడంతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలోనే మంగళవారం ఆ రెండు నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల సెగ్మెంట్​పై సమీక్ష చేసింది. ఆయా సెగ్మెంట్ల మైనారిటీ లీడర్లతో ఏఐసీసీ ఇన్​చార్జ్​ దీపాదాస్​ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్​ అలీ ఖాన్, రోహిత్​ చౌదరి, హైదరాబాద్​ సెగ్మెంట్​ ఇన్​చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​రివ్యూ చేశారు.

గ్రేటర్​ పరిధిలోని ముస్లిం ఓటర్లు టార్గెట్​గా పనిచేయాలని మైనారిటీ నేతలకు సూచించారు. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదని, ఈ సారి అది రిపీట్​ కావొద్దని దీపాదాస్​ మున్షీ స్పష్టం చేశారు. కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు కష్టపడి మంచి ఫలితాలు సాధించాలన్నారు. మూడు పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో బలాలు, బలహీనతలు అంచనా వేసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించే విధంగా నాయకులు కృషి చేయాలని సూచించారు. 

హైదరాబాద్​ పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులతో ఇప్పటికే ఓ సమావేశాన్ని నిర్వహించామన్నారు.  గ్రూపులు లేకుండా పార్లమెంట్ ఎన్నికల కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్నామని, అర్హులందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్​ పార్లమెంట్​ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తానని మున్షీ పర్కొన్నారు.