హైదరాబాద్, వెలుగు: పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా డాక్టర్ మంజువాణి నియమితులయ్యారు. ఈ మేరకు స్పెషల్ సీఎస్ అదర్ సిన్హా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటిదాకా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ రాంచందర్ ను పశుగణాభివృద్ధి సంస్థ సీఈవోగా నియమించారు. ఆయన స్థానంలో ముంజువాణి నియమించారు. కాగా.. గొర్రెల పంపిణీ పథకంపై కాగ్ రిపోర్టు వల్లే పశుసంవర్ధక శాఖలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. గతంలో డాక్టర్ లక్ష్మారెడ్డి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా ఉన్నపుడు గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయని ఇటీవల కాగ్ తన నివేదికలో తెలిపింది. నాలుగేండ్ల క్రితమే లక్ష్మారెడ్డి రిటైర్ అయినా ఆయన ఇప్పటికీ దళితబంధు సలహాదారుగా కొనసాగుతున్నారు. అవినీతి మచ్చపడిన అధికారులను ఇంకా తొలగించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పశుసంవర్ధక శాఖలో ఫైళ్ల మాయం కావడంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఓఎస్డీ పై కేసు నమోదు కావడం, ఇటీవల ఎసీబీ దర్యాప్తు చేపట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో డైరెక్టర్ను మార్చారని చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన తప్పులకు ప్రస్తుతం ఉన్న డైరెక్టర్పై వేటు వేయడంపై ఎస్టీ అధికారులు, గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

