- క్షిపణుల సాంకేతికత బదిలీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆమోదం
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం దేశీయ తయారీని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణుల టెక్నాలజీని భారతీయ రక్షణ సంస్థలకు బదిలీ చేయడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు.
దీంతో అర్హత ఉన్న దేశీయ ప్రైవేటు సంస్థలు ఈ టెక్నాలజీతో భారత్లోనే క్షిపణులను తయారు చేసే అవకాశం పొందనున్నాయి. డీఆర్డీవో అభివృద్ధి చేసిన సంప్రదాయ క్షిపణుల టెక్నాలజీని ఇకపై అర్హత ఉన్న ప్రైవేటు సంస్థలకు ఇస్తారు. ఇందుకోసం ఆయా సంస్థలు నిర్ణయించిన అర్హతలు, ధ్రువీకరణలు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనలు పాటించాలి.
పరిశోధన, అభివృద్ధి దశలో ఉన్న మిసైల్స్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే స్థాయికి తీసుకెళ్లడమే ఈ నిర్ణయం ఉద్దేశం. దేశంలోనే క్షిపణుల తయారీ పెరగడం వల్ల విదేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది.
పెద్ద రక్షణ సంస్థలతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావచ్చు. మిసైల్స్ తయారీతో పాటు వాటి విడిభాగాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి తయారీలోనూ దేశీయ సంస్థలకు అవకాశాలు పెరుగుతాయి.
స్వయం సమృద్ధికి బలం
క్షిపణి సాంకేతికతను దేశీయ సంస్థలకు బదిలీ చేయడం ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా తీసుకున్న చర్యగా కేంద్రం భావిస్తోంది. రక్షణ రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశంలోనే ఆయుధాల అభివృద్ధి, తయారీ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యం. డీఆర్డీఓ ఇప్పటికే పరిశ్రమలకు సాంకేతికతను బదిలీ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.
2025లోనే భారతీయ పరిశ్రమలకు 245 సాంకేతికత బదిలీ ఒప్పందాలు చేసిందని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 2,201 సాంకేతికత బదిలీ ఒప్పందాలు జరిగాయి. రక్షణ ఉత్పత్తిని పెంచడంతో పాటు భవిష్యత్తులో భారత్ను రక్షణ తయారీ, ఎగుమతుల కేంద్రంగా మార్చే ప్రయత్నాల్లో ఇది మరో ముఖ్యమైన అడుగుగా ప్రభుత్వం చూస్తోంది.
