- ఏడాదిగా చెల్లించని చార్జీలు
- 10వేల మంది డ్రైవర్ల ఎదురుచూపు
హైదరాబాద్, వెలుగు: డ్రైవర్ కం ఓనర్ల అద్దె కార్ల పైసలు.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. నెలల తరబడి చార్జీ డబ్బులు పెండింగ్లో ఉన్నా.. అస్సలు పట్టించుకోవట్లే.. దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్లో ఇదే పరిస్థితి ఉంది. సుమారు 10వేల మంది డ్రైవర్లు.. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.30 కోట్ల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని డ్రైవర్లు బాధపడుతున్నారు. చేతిలో డబ్బుల్లేకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. 2017 తర్వాత మంత్లీ చార్జీ పెంచకపోవడంతో గిట్టుబాటు కావడంలేదంటున్నరు.
నెలలకు నెలలే పెండింగ్..
యువతకు ఉపాధి కల్పించానే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం..డ్రైవర్ కమ్ ఓనర్ అనే స్కీం తీసుకొచ్చింది. గవర్నమెంట్ ఆఫీసర్ల కోసం అద్దె వెహికిల్కు జిల్లాల్లో అయితే నెలకు రూ.33 వేలు, హైదరాబాద్లో రూ.34వేలుగా నిర్ణయించారు. అధికారులు నెల రోజుల వరకు 2,500 కిలో మీటర్లు తిప్పుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తిరగడానికి వీల్లేదు. ఇలా తిరిగిన దానికి ప్రతీ నెలా హైర్ చార్జీలు చెల్లించాలి. కానీ చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో నెలలు గడుస్తున్నా డ్రైవర్లకు అద్దె చార్జీలు మాత్రం ఇవ్వడం లేదు. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఏకంగా ఏడాది దాటినా పైసలు పత్తా లేవు.
డిపార్ట్మెంట్ల వారీగా పెండింగ్ చార్జీలు
గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో 15 నెలలుగా బిల్లులు చెల్లించడంలేదు. ఆర్అండ్బీ, మైన్స్, మైనార్టీ వెల్ఫేర్, ఈఎన్సీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లలో ఏడాదిగా, హార్టీకల్చర్లో 9 నెలలు, ఎక్సైజ్, ఎస్టీ వెల్ఫేర్, ఇరిగేషన్, జిల్లాలోని డీఆర్డీఏ, ఐసీడీఎస్, డీటీవోలో 4 నెలలుగా, ఫిషరీస్, సివిల్ సప్లయ్లో 8 నెలలుగా, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో 6 నెలలుగా డ్రైవర్లకు చార్జీలు రావడం లేవు. సీపీవో, ఎస్సీలో 7 నెలలుగా, డీఎంహెచ్వో, ఎస్టీ గురుకులాల్లో 5 నెలలుగా, ఆర్టీవో ఆఫీసుల్లో మూడు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 2 నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లలో సుమారు 10వేల మంది డ్రైవర్లు పనిచేస్తున్నట్లు యూనియన్ లీడర్లు చెబుతున్నారు.
ఫండ్స్ లేవంట..!
అద్దె కార్ల హైర్చార్జీలు చెల్లించాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకుండా పోతోందని డ్రైవర్లు వాపోతున్నారు. ఫండ్స్ లేవని చెబుతున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు తమ సొంత పనులకు కూడా తమ బండ్లే ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు బినామీల పేరుతో అద్దె కార్లు తీసుకుంటున్నారని అంటున్నారు. తమ పొట్ట కొట్టేందుకు కావాలనే బిల్లులు లేట్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయని డ్రైవర్లు చెబుతున్నారు.
2017 నుంచే చార్జీలు పెంచలే..
2017లో నిర్ణయించిన చార్జీలనే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలుచేస్తోంది. డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. డీజిల్, ఇన్సూరెన్స్, క్వార్టర్లీ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్లు, ఫిట్నెస్ చార్జీలు భారీగా పెరిగాయి. బండ్ల మెయింటనెన్స్ కూడా ఎక్కువైంది. దీంతో సర్కారు ఇచ్చే రూ.33వేలు, రూ.34వేలు సరిపోవడంలేదని డ్రైవర్లు వాపోతున్నారు.
ఏడాది నుంచి పెండింగ్..
ఇప్పటికే డ్రైవర్లు పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉన్నాం. ఇన్సూరెన్స్, డీజిల్, ఈఎంఐ, మెయింటె నెన్స్ భారాలు రోజురోజుకు పెరిగిపోతున్నయ్.. ఏడాదిగా అద్దె చార్జీలు ఇవ్వడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలె. అంతే గాకుండా ప్రతి నెలా ఇచ్చేలా అధికారులు చొరవ చూపాలె.. - ఎం.రాజశేఖర్, డ్రైవర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్
చార్జీలు పెంచాలె..
డ్రైవర్లంతా బడుగుల బలహీన వర్గాలకు చెందిన వారే. ఆరు నెలలు, ఏడాదికి బిల్లులు ఇస్తే ఎట్ల బతుకుతారు..? 2017లో నిర్ణయించిన చార్జీలనే ఇంకా అమలు చేస్తున్నరు. ఈఎంఐలు, డీజిల్ రేట్లు, ట్యాక్స్ అన్నీ పెరిగినయ్.. దీనిపై మంత్రులు, పెద్ద సార్లకు వినతిపత్రాలు ఇచ్చాం. రెగ్యులర్గా బిల్లులు ఇస్తూనే.. చార్జీలు పెంచాలి. - షేక్ సలావుద్దీన్, తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్, స్టేట్ ప్రెసిడెంట్.