హైదరాబాద్, వెలుగు: నాలుగున్నరేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో బంజారాహిల్స్ లోని కారు డ్రైవర్ బీమన రజనీకుమార్ (34), ప్రిన్సిపల్ మాధవి (55) ని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి.. చంచల్గూడ జైలులో రిమాండ్కి తరలించారు. వివరాలను బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ మీడియాకు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నం.14లో ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ మాధవి కారు డ్రైవర్గా రజనీ కుమార్ పనిచేస్తున్నాడు. రోజూ అదే స్కూల్లో తిరుగుతూ స్టూడెంట్లతో అతను అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలోనే ఎల్కేజీ చదువుతున్న నాలుగున్నరేండ్ల చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. గత 3 నెలల్లో కొన్నిసార్లు బాలికను డిజిటల్ క్లాస్ రూమ్లోకి తీసుకెళ్లి, చేతులు కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో చిన్నారి అనారోగ్యానికి గురైంది. ఆమె పరిస్థితి గమనించి తల్లి వివరాలు తెలుసుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మంగళవారం స్కూల్కి వెళ్లింది. ప్రిన్సిపల్ మాధవిని వారంతా నిలదీశారు. అక్కడే ఉన్న ఆమె కారు డ్రైవర్ రజనీకుమార్పై కర్రలతో దాడి చేశారు. పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. చిన్నారి తల్లి ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.
ఇన్స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. చిన్నారిని భరోసా సెంటర్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా లైంగిక దాడి జరిగినట్లు గుర్తించారు. నిందితుడు రజనీ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. లైంగికంగా దాడి చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. అత్యాచారం, పోక్సో యాక్ట్ కింద అతడిపై కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్ మాధవి నిర్లక్ష్యం వల్లే దారుణం జరిగిందని ఆమెపై కూడా కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. రజనీకుమార్ బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.