మందుబాబులు అలర్ట్. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ సమయాలను ట్రాఫిక్ పోలీసులు మార్చారు. ఇకపై అర్థరాత్రి వరకు పీకలదాకా తాగి..అర్థరాత్రి దాటాకా ఇంటికి వెళ్దామంటే కుదరదు. ఎందుకంటే హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ సమయాలను మార్చారు. ప్రతీ రోజు అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
కారణమేంటంటే..
గత కొద్దికాలంగా హైదరాబాద్ లో మందుబాబులు బీభత్సం సృష్టి్స్తున్నారు. పీకలదాకా తాగడం..తాగాక..ఇష్టానుసారంగా వాహనాలను డ్రైవ్ చేసి ప్రాణాలను బలిగొనడం చేస్తున్నారు. ముఖ్యంగా అర్థరాత్రి తర్వాత నగరంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో మందుబాబులపై ఉక్కుపాదం మోపుతూ...రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతోనే అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య డంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సుధీర్ బాబు తెలిపారు. తాగి వాహనాలు నడిపే వారితో రోడ్డు ప్రమాదాలు జరిగిన హాట్స్పాట్లను గుర్తించి...ఆ ప్రాంతాల్లో డంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామన్నారు.
తప్పించుకోలేరు..
హైదరాబాద్లోని హాట్ స్పాట్లలో డంక్ అండ్ డ్రైవ్ లు చేసే స్పెషల్ టీమ్స్ కు ఇన్స్పెక్టర్ లేదా సబ్-ఇన్స్పెక్టర్ నేతృత్వం వహిస్తారు. డంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులపై కేసు నమోదు చేసి ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్తారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటారు. పీకలదాకా తాగి అర్ధరాత్రి దాటాకా డ్రైవ్ చేస్తే తప్పించుకుంటామంటే కుదరదు. డ్రంక్ డ్రైవింగ్ చెకింగ్ మొత్తం వీడియో గ్రాఫ్ చేయబడింది. తద్వారా పట్టుబడిన వ్యక్తులు తప్పించుకోలేరు.
తిక్క కుదర్చారు..
2023లో ఇప్పటి వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 13,431 మందిని పట్టుకున్నారు. వీరిలో 1317 మందికి జైలు శిక్ష పడింది. 243 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయింది. కోర్టు ఆదేశాలతో రోడ్డు రవాణా సంస్థ అధికారులు 53 మంది లైసెన్స్లను శాశ్వతంగా రద్దు చేశారు. తాగి వాహనాలు నడిపినందుకు గాను మొత్తం రూ.3,21,39,060 ఫైన్ విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే గోషామహల్, బేగంపేటలోని ట్రాఫిక్ శిక్షణా సంస్థలో కౌన్సెలింగ్కు హాజరవ్వాల్సి ఉంది.