
1998 డీఎస్సీ మెరిట్ లిస్ట్పై ఆఫీసర్లు, అభ్యర్థుల తలోమాట
4 జిల్లాల్లో 9 మందే ఎలిజిబుల్ అంటున్న విద్యా శాఖ
అర్హులు 400 మంది వరకూ ఉంటారని అభ్యర్థుల వాదన
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ-1998 పోస్టింగ్స్ లొల్లి చివరిదశకు చేరింది. 4 వారాల్లో మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని హైకోర్టు ఆదేశాలివ్వడంతో విద్యాశాఖ అధికారుల్లో కలవరం మొదలైంది. 21 ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఇది సంతోషం కలిగించే తీర్పు అయినప్పటికీ ఎంతమందికి ఉద్యోగం వస్తుందో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొంది. దీనిపై క్లారిటీ లేదని అధికారులు చెబుతున్నారు. అప్పటి మెరిట్ జాబితా ఆధారంగా 4 జిల్లాల పరిధిలో 400 మంది ఉంటారని అభ్యర్థులు చెబుతుంటే కేవలం 9 మందే ఉన్నట్టు అధికారులంటున్నారు.
ఇదీ విషయం..
1998లో అప్పటి ప్రభుత్వం 38 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ వేసింది. రాత పరీక్షకు 85 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయించారు. ఓసీ కేటగిరీలో 50, బీసీ 45, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 మార్కులను కటాఫ్గా నిర్ణయించి ఇంటర్వ్యూలకు పిలిచారు. ఈ మేరకు 221 జీఓ జారీ అయింది. అయితే రాతపరీక్ష ఫలితాలు ప్రకటించే టైమ్లో నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అసెంబ్లీ బై ఎలక్షన్స్ వచ్చాయి. దీంతో ఆ జిల్లాల్లో రిజల్ట్ ఇవ్వలేదు. మిగిలిన జిల్లాల్లో కొన్ని కేటగిరీల్లో కటాఫ్ ఉన్న అభ్యర్థులు లేక ఓసీలో 45, బీసీలో 40, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 35మార్కుల కటాఫ్ తగ్గిస్తూ మళ్లీ జీఓ 618 ఇచ్చారు. మొదట జీవో 221 ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులున్న వారికి పోస్టింగ్లు ఇచ్చి ఆ తర్వాత, జీఓ 618 ప్రకారం తక్కువ కటాఫ్ మార్కు లున్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నది. కానీ తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించిన నాలుగు జిల్లాల్లో మాత్రం రెండు జీవోలకు అనుగుణంగా ఒకేసారి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు. దీంతో జీవో 221 ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులున్న అభ్యర్థులు.. తమకు జాబ్స్ రాలేదని కోర్టు కెళ్లారు. 21 ఏండ్లపాటు న్యాయస్థానంలో ఉద్యోగాల కోసం పోరాడారు.
అధికారుల్లో గందరగోళం
‘డీఎస్సీ-1998’ కేసులో ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, 2011లో హైకోర్టు తీర్పులను అమలు చేయాలని ఇటీవల మళ్లీ హైకోర్టు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో పాత ఫైళ్లన్నీ అధికారులు వెతుకుతున్నారు. వారి వద్దనున్న సమాచారం మేరకు గత మెరిట్ జాబితా ఆధారంగా కరీంనగర్లో ఆరుగురికి, నల్గొండలో ముగ్గురికే ఉద్యోగాలు వచ్చే అవకాశముందని చెప్తున్నారు. మిగిలిన రెండు జిల్లాల్లో పిటిషన్ దారుల్లో అర్హులెవరూ లేరంటున్నారు. కానీ అభ్యర్థుల వాదన మరోలా ఉంది. ఈ 4 జిల్లాల పరిధిలో కోర్టుకు పోయిన వారిలో 400 మందికి ఉద్యోగాలు వచ్చే చాన్స్ ఉందంటున్నారు. నిజానికి విద్యాశాఖాధికారుల వద్ద అప్పటి ఫైళ్లు పూర్తిస్థాయిలో లేవు. దీంతో దేని ఆధారంగా జాబ్స్ ఇవ్వాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
పిటిషన్ వేసినోళ్లందరికీ న్యాయం చేయాలె
4 జిల్లాల్లోని పిటిషన్ దారులందరికీ న్యాయం చేయాలె. లీగల్గా, టెక్నికల్గా సమస్యలుంటే సరిచేస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. 21 ఏండ్లపాటు ఉద్యోగాల కోసం పోరాటం చేశాం. తీర్పు మాకు అనుకూలంగా ఉంది. -కె.శ్రీనివాస్, 1998 డీఎస్సీ సాధన సమితి అధ్యక్షుడు