తెగిన రోడ్లు.. నిలిచిన రాకపోకలు

తెగిన రోడ్లు.. నిలిచిన రాకపోకలు

కరీంనగర్,​వెలుగు:  భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో పలుగ్రామాలకు రాకపోకలు బంద్​అయ్యాయి. కరీంనగర్​జిల్లా గన్నేరువరం ఊర చెరువు మత్తడి రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండడంతో చొక్కా రావుపల్లె, గన్నేరువరం గ్రామాలకు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.  జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు మత్తడి నీటి ప్రవాహం రోడ్డుపై పొంగిపొర్లుతుండడంతో వీణవంక–జమ్మికుంట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంగాధర మండలం గట్టుభూత్కూర్ చెరువు మత్తడి దూకడంతో రామడుగు మండలం వెలిచాల, గంగాధర మండలం గట్టుభూత్కూర్, ఆచంపల్లి, కొత్తపల్లి మండలం బద్దిపల్లి, నాగులమల్యాల గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలకు వెళ్లాల్సిన వారు కరీంనగర్ రేకుర్తి మీదుగా వెళ్తున్నారు. వీణవంక మండలంలో కనపర్తి జలదిగ్భందంలో చిక్కుకుంది.  సైదాపూర్  జాగిరిపల్లి లో లెవల్ బ్రిడ్జి ప్రమాద స్థాయిలో పొంగుతుండగా హుజూరాబాద్–-- హుస్నాబాద్ రాకపోకలు నిలిచిపోయాయి. చిగురుమామిడి మండలంలో కరీంనగర్–హుస్నాబాద్ రాకపోకలు నిలిచిపోయాయి. 

AsloRead:ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయాలి:  డీఐజీ ఎల్.ఎస్. చౌహన్ 

రాకపోకలు బంద్​

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మూడు బొమ్మల మేడిపల్లి వద్ద చెరువు నిండి రోడ్డు పై ప్రవహించడం తో మెట్‌పల్లి నుంచి నిజామాబాద్ రూట్ బంద్​ చేశారు. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామ శివారులోని ఎరుగట్ల తీగల వాగు రోడ్డు పైనుంచి వెళ్లడంతో జగిత్యాల జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాకు రాకపోకలను నిలిపివేశారు. జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామ రోడ్డు డ్యాం పై నుంచి ప్రవాహం పెరగడంతో ధర్మపురి-కి రోడ్డును మూసేశారు. సుల్తానాబాద్: సుల్తానాబాద్​లో దుబ్బపల్లి వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు చేరడంతో వన్ వే లోనే వాహనాలను నడిపించారు.