పక్కరాష్ట్రాల కారణంగా మన రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాం

పక్కరాష్ట్రాల కారణంగా మన రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాం

ధరలను 75 శాతం పెంచడంతో తప్పని పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కూడా 16 శాతం వరకు ధరలను పెంచాల్సి  వచ్చిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో మద్యం నిల్వలు తగినన్ని ఉన్నాయని, మద్యం కొరత ఏర్పడే అవకాశం లేదన్నారు. వైన్ షాపుల దగ్గర భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. నిబంధనలను పాటించని  28 షాపులపై కేసులు నమోదు చేసి, లైసెన్స్ రద్దు చేసినట్టు చెప్పారు.

హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ భవన్ లో ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. పెరిగిన ధరలకే ఇవాళ మద్యాన్ని అమ్మామని తెలిపారు. రాష్ట్రంలో మద్యం లభించకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం కూడా వచ్చిందని చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలు ముందుగానే లిక్కర్ షాపులు తెరిచాయన్నారు. మద్యం అందుబాటులో లేకపోవడంతో గుడుంబా మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వీటన్నింటిపై మంత్రులు, ఉన్నతాధికారుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే లిక్కర్ షాపులను తెరవాలని నిర్ణయించామని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.