
బెంగళూరు: దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ ఫైనల్ దిశగా అడుగులు వేస్తోంది. సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా (133) సెంచరీతో చెలరేగడంతో149/3 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన వెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 92 ఓవర్లలో 292/9 స్కోరు చేసింది. అర్జాన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. సూర్యకుమార్ (54) హాఫ్ సెంచరీ చేయగా, హెట్ పటేల్ (27) ఫర్వాలేదనిపించాడు. అయితే సౌరభ్ కుమార్ (4/79), సారాన్ష్ జైన్ (3/56) దెబ్బకు మిగతా వారు ఫెయిలయ్యారు. ప్రస్తుతం వెస్ట్ జోన్ 384 రన్స్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. మరో రోజు ఆట మిగిలి ఉంది.
సౌత్ జోన్ టార్గెట్ 215
మరో సెమీస్లో నార్త్ జోన్.. సౌత్ జోన్ ముందు 215 రన్స్ టార్గెట్ను నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు మూడో రోజు బరిలోకి దిగిన సౌత్ ఆట ముగిసే టైమ్కు రెండో ఇన్నింగ్స్లో 6.3 ఓవర్లలో 21/0 స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (5 బ్యాటింగ్), మయాంక్ అగర్వాల్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సౌత్ జోన్ విజయానికి ఇంకా 194 రన్స్ కావాలె. అంతకుముందు 51/2 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 211 రన్స్కు ఆలౌటైంది. ప్రభుసిమ్రాన్ సింగ్ (63), హర్షిత్ రాణా (38) రాణించారు. విజయ్ కుమార్ 5, సాయి కిశోర్ 3 వికెట్లు తీశారు.