మెదక్, వెలుగు: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ లో డూప్లికేట్ పిస్టల్తో చంపుతానని బెదిరించడం కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. హవేలీ ఘనపూర్ సమీపంలో హైదరాబాద్ కు చెందిన నిల్సన్కు అతని భార్య పుష్పమ్మ పేరు మీద ఐదెకరాల భూమి ఉంది. కాగా, హవేలి ఘనపూర్కు చెందిన సిద్దమ్మ ఆ భూమిని ప్రభుత్వం తమకు అసైన్మెంట్ కింద కేటాయించిందని చెబుతోంది. ఈ విషయమై చాలా ఏండ్లుగా ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతుండగా, సిద్దమ్మ కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంది.
ఈక్రమంలో సిద్దమ్మ తమ్ముడు ఎల్లం గురువారం ఉదయం ఆ భూమి వద్దకు వెళ్లగా, నాగాపూర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు అడ్డుకున్నారు. యోహాన్ అనే వ్యక్తి తనను డూప్లికేట్ పిస్టల్తో చంపుతానని బెదిరించినట్లు ఎల్లం పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డూప్లికేట్ పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. ఎల్లంను బెదిరించిన యువకుడి వద్ద ఉన్నది పిస్టల్ మాదిరిగా ఉండే లైటర్ అని మెదక్ రూరల్ సీఐ జార్జి తెలిపారు. పిస్టల్ మాదిరిగా ఉండే లైటర్తో బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
