- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వేదికపై మోడీకి జగన్ విజ్ఞప్తి
- తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ
- ఇక్కడ మాత్రం వామపక్షాలతో కలిసి టీఆర్ఎస్ నిరసనలు
- వరుసగా నాలుగోసారి ప్రధాని టూర్కు సీఎం గైర్హాజరు
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి.. రెండు రాష్ట్రాల్లో భిన్నమైన అనుభవం ఎదురైంది. ఏపీలో అక్కడి సీఎం జగన్ ఘనంగా స్వాగతం పలికి, బహిరంగ సభలో ప్రధానితో పాల్గొని, విభజన హామీలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా.. ఇక్కడ సీఎం కేసీఆర్ మాత్రం ప్రధాని పర్యటనకు దూరంగా ఉన్నారు. ఉదయం నుంచి మీటింగ్లు, రివ్యూలు ఏమీ లేవని, ప్రగతి భవన్లోనే కేసీఆర్ రెస్ట్లో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని కలిసి సమస్యలు వివరించే అవకాశం ఉన్నా కేసీఆర్ వినియోగించుకోలేదని, ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేయాలని, విశాఖకు రైల్వే జోన్ కేటాయించాలని సభా వేదికపైనే మోడీకి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ మళ్లీ తమ విజ్ఞప్తులను ప్రధానికి తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. కేంద్రంతో తమ బంధం రాజకీయాలకు అతీతమైనదని, తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో ఎజెండా లేదని జగన్ తెలిపారు. అయితే తెలంగాణలో అందుకు భిన్నంగా ప్రధాని మోడీ టూర్కు వరుసగా నాలుగోసారి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం ఏపీ నుంచి ప్రధాని మోడీ రాష్ట్రానికి రాగా.. స్వాగతించాల్సిన సీఎం దూరంగా ఉన్నారు. గవర్నర్ తమిళిసై, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్వాగతం పలికారు.
వామపక్షాలతో కలిసి నిరసనలు
ఏపీలో ప్రధాని పర్యటనకు అక్కడి వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తే.. రాష్ట్రంలో మాత్రం ‘ప్రధాని గో బ్యాక్’ అంటూ టీఆర్ఎస్ ప్రచారం చేయటం, అనుబంధ సంఘాలు, వామపక్షాలతో నిరసనలు చేయించడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఏడాది మే 26న ఐఎస్బీ 20వ కాన్వొకేషన్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్కు వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఇదే తీరుగా ఫ్లెక్సీల క్యాంపెయిన్ చేసింది. జులైలో హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పాల్గొనేందుకు వచ్చిన మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు, బోర్డులు, హోర్డింగులతో ప్రచారం చేపట్టింది. సమతామూర్తి విగ్రహావిష్కరణకు మోడీ హాజరయ్యారు. అప్పటినుంచే ప్రధాని టూర్కు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు.