- జిల్లాలో స్కీమ్ అమలు చేయని మున్సిపల్ ఆఫీసర్లు
- పథకం ప్రవేశపెట్టినా సబ్సిడీని ప్రకటించని ప్రభుత్వం
- టార్గెట్లు లేక గాలికొదిలేసిన అధికారులు
- ఆఫీసర్లు పట్టించుకోవాలని స్ట్రీట్ వెండర్స్ డిమాండ్
మహబూబ్నగర్, వెలుగు : మున్సిపాలిటీల్లోని స్ట్రీట్ వెండర్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంట లేదు. ‘పీఎం స్వనిధి’ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న లోన్లు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎలాంటి లోన్లు, స్కీమ్లు అమలు కావడం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని వీధివ్యాపారులకు ఈఎంఐల ద్వారా ఎలక్ర్టిక్ ఆటోల స్కీమ్ ప్రవేశ పెట్టినా.. అధికారుల నిర్లక్ష్యంతో ఆ స్కీమ్ ఉందని కూడా వారికి తెలియడం లేదు. ఆఫీసర్లు స్కీమ్పై అవగాహన కల్పించి ఎలక్ట్రిక్ ఆటోలు ఇవ్వాలని స్ట్రీట్వెండర్స్ కోరుతున్నారు.
మూడు మున్సిపాలిటీల్లో..
పాలమూరు జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 14,781 మంది స్ట్రీట్ వెండర్లు ఉండగా, అందులో పాలమూరులో 11,404 మంది, జడ్చర్ల 2,609, భూత్పూర్768 మంది ఉన్నట్లు 2018లో మెప్మా ఆధ్వర్యంలో గుర్తించారు. వీరంతా మున్సిపాలిటీల్లో రోడ్ల పక్కన రేకుల డబ్బాలు వేసుకొని కటింగ్షాపులు, చాయ్ దుకాణాలు, కూరగాయలు, తోపుడు బండ్లపై పండ్లు, చిన్న పిల్లల బట్టలు అమ్ముకునే వారు. వీరు ఒకే చోట కాకుండా కాలనీలు, గ్రామాల్లో జరిగే వారాంతపు సంతల్లో తిరుగుతూ వస్తువులు అమ్ముకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 2019లో బ్యాటరీలతో నడిచే ఎలక్ర్టిక్ ఆటోలు ఇప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘మెప్మా’ మిషన్ డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ నుంచి స్ర్టీట్ వెండర్లకు ఎలక్ర్టికల్ ఆటోలపై అవగాహన కల్పించాలని ఉత్తర్వులు కూడా వచ్చాయి. కానీ, స్థానిక అధికారులు మాత్రం దీన్ని సీరియస్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఒకటి, రెండు సార్లు మహబూబ్నగర్ మున్సిపాలిటీలో కొందరు స్ర్టీట్ వెండర్లకు అవగాహన కల్పించారు. ఓ కంపెనీకి చెందిన రెండు ఆటోలను తీసుకొచ్చి వాటి పని తీరు గురించి వివరించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలక్ర్టిక్ ఆటోల ప్రస్తావనే లేదు.
సబ్సిడీ కూడా లేదు..
బట్టలు, కూరగాయలు, పండ్లు, చాయ్ అమ్మి స్ట్రీట్ వెండర్లు వారి కుటుంబాలను పోషించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి బ్యాటరీ ఆటోలు ఇప్పిస్తామని చెప్పిందే తప్ప, సబ్సిడీ ప్రకటించ లేదు. బ్యాంక్ లోన్ల ద్వారా ఆటోలు తీసుకొని, నెల నెలా ఈఎంఐలు కట్టుకోవాలని చెప్పింది. ఉదాహరణకు స్త్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి ‘మెప్మా’కు నవంబరు 27, 2020 లో వచ్చిన లెటర్ ప్రకారం.. ఒక ఆటోకు రూ.3,04,427 లోన్ ఇవ్వాలని, లబ్ధిదారుడు నెలకు రూ.6,720 చొప్పున 60 నెలలు ఈఎంఐలు కట్టాలని ఉంది. ఈ లెక్కన అసలుతో పాటు లక్ష రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. ఇది వీధి వ్యాపారులకు భారం అవుతోంది.
క్షేత్ర స్థాయిలో అవగాహన నిల్
జిల్లాలో 14,781 మంది స్ర్టీట్ వెండర్లు ఉంటే, అందులో పది శాతం మందికి కూడా ఈ -ఆటోల గురించి తెలియడం లేదు. ప్రతి మున్సిపాలిటీలో ఈ -ఆటోలను ఏర్పాటు చేసి దాని గురించి వివరించాల్సి ఉన్నా, ఒక్క పాలమూరులో తప్ప భూత్పూర్, జడ్చర్లలో ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ మున్సిపాలిటీల పరిధిలోని స్ట్రీట్ వెండర్లను ఈ -ఆటోల గురించి ప్రశ్నిస్తే, అలాంటి ఆటోలు మాకు కూడా ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసర్లు వచ్చి వాటి గురించి వివరిస్తే, తాము కూడా తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఆఫీసర్ కూడా మా వద్దకు వచ్చి ఈ -ఆటోల గురించి చెప్పలేదని అంటున్నారు.
మాకు ఎవరూ చెప్పలే..
మున్సిపల్అధికారులు మా వద్దకు వచ్చి.. మీ కోసం ఈ స్కీమ్ ఉందని ఎప్పుడూ చెప్పలే. వీధి వ్యాపారులకు బ్యాటరీ ఆటోలు లోన్ కింద ఇస్తరనే విషయం మీరు చెప్తేనే వింటున్న. అధికారులు వచ్చి ఆటోల గురించి చెప్తే.. దాని పని తీరు చూసి.. తీసుకోవాలా? వద్దా? అని ఆలోచన చేస్తా.
-శ్రీనివాస్, పండ్ల వ్యాపారి, జడ్చర్ల
ఎలాంటి సమాచారం చెప్పరు
కుటుంబాన్ని పోషించుకునేందుకు భూత్పూర్ ఫ్లైఓవర్ కింద తోపుడు బండి ఏర్పాటు చేసుకొని పండ్లు అమ్ముకుంటున్న. మాలాంటి వీధి వ్యాపారులకు గవర్నమెంట్ స్కీమ్లు ఉంటాయనే విషయం నాకు తెల్వదు. బ్యాటరీ ఆటోలు ఎట్లుంటయో కూడా నేను చూడలే. ఏ అధికారి వచ్చి ఆ ఆటో గురించి నాకు చెప్పలే.
- శ్రీనివాసులు, పండ్ల వ్యాపారి, భూత్పూర్
