జమ్మూలో ఒకేరోజు నాలుగు భూకంపాలు..ప్రాణ భయంతో స్థానికుల పరుగులు

జమ్మూలో ఒకేరోజు నాలుగు  భూకంపాలు..ప్రాణ భయంతో స్థానికుల పరుగులు

శ్రీనగర్​: జమ్మూ ప్రాంతాన్ని భూకంపాలు మళ్లీ వణికించాయి. బుధవారం ఉదయం కిష్టావర్, డోడా, రియాసీ జిల్లాలోని కాట్రాలో నాలుగు భూకంపాలు సంభవించాయి. భూకంప తీవ్రత కిష్టావర్ లో 3.3, డోడాలో 3.5, 4.3, కాట్రాలో 2.8 గా నమోదైంది. కిష్టావర్ లో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఉదయం 8.29 గంటలకు ఇక్కడ భూకంపం వచ్చింది. అంతకుముందు డోడాలో  7.56 గంటలకు భూమి కంపించింది. 

ఇక్కడ పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెల్లవారుజామున 2.30 గంటలకు కూడా డోడాలో 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక కాట్రాకు తూర్పున 74 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 2.43 గంటలకు భూకంపం సంభవించింది. ఇక్కడ 5 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. వరుస భూకంపాలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అయితే ఈ భూకంపాలతో ప్రాణ, ఆస్తినష్టం ఏమీ వాటిల్లలేదని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించామని పేర్కొన్నారు. స్థానికులు కంగారు పడవద్దని సూచించారు.