కాంగోలో రెండు మందుల ట్రయల్స్ సక్సెస్
వ్యాధి తొలిదశలో ఇస్తే 90% బతికే చాన్స్
రోగాన్ని తట్టుకున్న వాళ్ల యాంటీబాడీస్తో డ్రగ్స్ తయారు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్కు మందులు త్వరలోనే రాబోతున్నాయి. గతేడాది ఒక్క డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోనే 1,800 మందికి పైగా జనాలను పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారిని తరమికొట్టే డ్రగ్స్ వస్తున్నాయి. నాలుగు రకాల మందులను కాంగోలోని పేషెంట్లపై ప్రయోగాత్మకంగా పరిశీలించగా రెండు డ్రగ్స్ (ఆర్ఈజీఎన్ ఈబీ3, ఎంఏబీ 114) మంచి ఫలితాలిచ్చాయి. వ్యాధికి సరైన యాంటీ బాడీస్ను సృష్టించి మనుషులపై ఎబోలా ప్రభావాన్ని తగ్గించాయి. ప్రస్తుతం ఈ రెండు మందులను కాంగోలోని అన్ని వయసుల రోగులకు వాడుతున్నారని సైంటిస్టులు వెల్లడించారు. వ్యాధి తొలిదశలోనే రోగికి వీటినిస్తే బతికే చాన్స్ 90 శాతం వరకు ఉంటుందని చెప్పారు. ఎబోలా నుంచి బయటపడిన కొందరు మనుషులు యాంటీబాడీస్ తీసుకొని ఈ రెండు మందులను తయారు చేశారు. మరో రెండు డ్రగ్స్ జెడ్మాప్, రెమ్డెసివిర్లు ఎబోలాపై తక్కువ ప్రభావం చూపడంతో పక్కనబెట్టారు. ట్రయల్స్కు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సాయం చేసింది.
700 మందిపై ప్రయోగం
ప్రపంచ ఆరోగ్య సంస్థ సాయంతో ఇంటర్నేషనల్ రీసెర్చ్ గ్రూప్ గత నవంబర్లో ఈ ట్రయల్స్ చేసింది. నాలుగు డ్రగ్స్ను 700 మంది పేషెంట్లపై ప్రయోగించింది. 499 మందిపై ఆ డ్రగ్స్ చూపిన ప్రభావం తెలిసింది. వీళ్లలో ఆర్ఈజీఎన్ ఈబీ3 ఇచ్చిన వాళ్లు 29 శాతం, ఎంఏబీ 114 తీసుకున్న వాళ్లు 34 శాతం మంది చనిపోయారు. జెడ్మాప్ వాడిన వాళ్లు 49 శాతం, రెమ్డెసివిర్ తీసుకున్న వాళ్లు 53 శాతం మంది మృతిచెందారు. తొలిదశలోనే వ్యాధిని గుర్తించిన వారికి ఆర్ఈజీఎన్ ఈబీ3 ఇస్తే 94 శాతం బతికే చాన్స్ ఉంటుందని, ఎంఏబీ 114 ఇస్తే 89 శాతం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతానికి ఎబోలాను వదిలించుకోలేకపోవచ్చు గానీ ఈ డ్రగ్స్తో వ్యాధి సోకిన వారిని కాపాడుకునే చాన్స్ పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
ట్రయల్స్కు ఇబ్బంది
కాంగో దేశాన్ని ఎబోలా భయపెడుతోంది. ఈ జులైలో ఆ దేశంలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. 2014 నుంచి 2016 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో సుమారు 28 వేల మందికి వ్యాధి సోకింది. ముఖ్యంగా గినియా, లైబీరియా, సియెర్రా లియోన్లలో బాగా ప్రబలింది. 11 వేల మందిని బలితీసుకుంది. కానీ ఆయా దేశాలు విధిస్తున్న ఆంక్షలు వ్యాధిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ఆపుతున్నాయి. ఆ దేశాల్లో అల్లర్లు పెరగడం, విదేశీ మెడికల్ సాయాన్ని వద్దనడం వల్ల రోగాన్ని అరికట్టడం కష్టమవుతోంది. ఓ డబ్ల్యూహెచ్వో వైద్య సిబ్బందిని చంపిన కేసులో ఇటీవలే ముగ్గురు కాంగో డాక్టర్లను అరెస్టు చేశారు. ఈ ఏడాది సుమారు 200 హెల్త్ క్యాంపులను ధ్వంసం చేశారు. దీంతో వ్యాక్సినేషన్ ట్రీట్మెంట్కు ఇబ్బంది తలెత్తుతోంది.
