హైదరాబాద్, వెలుగు: ధర్మపురి శాసనసభ స్థానానికి 2018లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, ఫైళ్లను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూమ్కు సీల్ వేయడంలో లోపాలపై హైకోర్టుకు ఈసీ కమిటీ రిపోర్టు అందించింది. ఈవీఎంలు, ఫైళ్లను భద్రపరచడంలో విధానపరమైన లోపాలను గుర్తించినట్లు కమిటీ పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్కు రెండు తాళాలు వేయలేదని తెలిపింది. అప్పటి జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్) ఎ.శరత్, నియోజకర్గ రిటర్నింగ్ అధికారి భిక్షపతి, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి రాజేశం.. ఎన్నికల కమిషన్ సూచనలను అమలు చేయలేదని తెలిపింది. రెండు తాళాలు వేయాలన్న ఈసీ ఆదేశాల్ని అమలు చేయలేదని, రిటర్నింగ్ అధికారి నుంచి తాళాలు తీసుకోడానికి రాజేశం ఆసక్తి చూపలేదని కమిటీ వివరించింది. ఎన్నికల అధికారులు రవి, యాస్మిన్లు కూడా తాళాలు తీసుకోలేదు అని పేర్కొంది.
2018 ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ రావుపై స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ గెలుపొందారు. ఫలితాల వెల్లడిలో అవకతవకలు జరిగాయంటూ లక్ష్మణ్ రావు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కమిటీ తన రిపోర్టును హైకోర్టుకు సమర్పించింది.