హైదరాబాద్, వెలుగు:
మేయర్, చైర్ పర్సన్ ఎన్నిక కోసం జరిగే పరోక్ష ఎన్నికల్లో ఓట్లు సమానంగా వస్తే లాటరీ పద్ధతిలో విజేతను ఎంపిక చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. 120 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, 9 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుందని చెప్పారు. ఈ ఎన్నిక కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు గెజిటెడ్ ఆఫీసర్లను ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా శనివారం నియమిస్తారని ఆయన అన్నారు. వీరే ఈ నెల 27న జరిగే ఎన్నికకు రావాల్సిందిగా కోరుతూ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు నోటీసులు పంపుతారని తెలిపారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ టీకే శ్రీదేవితో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చైర్పర్సన్, మేయర్ ఎన్నికకు అనుసరించే గైడ్లైన్స్ను తెలిపారు. పార్టీ తరఫున మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులను ఎవరు ప్రకటిస్తారో తెలుపుతూ పార్టీ అధ్యక్షుడు లేదా పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ నెల 26న ఉదయం 11 గంటలలోపు ఫామ్ –ఏను ప్రిసైడింగ్ ఆఫీసర్కు అందజేయాలన్నారు. ఫామ్ ఏలో పేర్కొన్న వ్యక్తి ఈ నెల 27న ఉదయం 10 గంటలలోపు తమ పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ అభ్యర్థుల పేర్లతో కూడిన ఫామ్ –బీని అందజేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. రాజకీయ పార్టీలు తమ పార్టీల తరఫున గెలిచిన సభ్యులకు విప్ జారీ చేసేందుకు విప్లను నియమించుకోవచ్చని నాగిరెడ్డి తెలిపారు. పార్టీ విప్ల పేర్లను అనగ్జరీ 1, 2లో ఆయా పార్టీల అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి ఈ నెల 26న ఉదయం 11 గంటల వరకు ప్రిసైడింగ్ ఆఫీసర్లకు అందించాలని, అదేవిధంగా సదరు విప్లు తమ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే వివరాలను అనగ్జరీ –3లో ఈ నెల 27న ఉదయం 11.30 వరకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
నేటి సాయంత్రం నుంచి స్పెషల్ మోడ్ ఆఫ్ కండక్ట్
మేయర్, చైర్పర్సన్ పరోక్ష ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో స్పెషల్ మోడ్ ఆఫ్ కండక్ట్ శనివారం సాయంత్రం నుంచి అమలులోకి వస్తుందని ఎస్ఈసీ నాగిరెడ్డి తెలిపారు. ఇది ముఖ్యంగా అధికార పార్టీకి వర్తిస్తుందని, గెలిచిన ఇతర పార్టీల వారికి పదవులు, కాంట్రాక్టులు ఆశచూపకుండా నిరోధించడమే దీని ఉద్దేశమన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 27న ఉంటుందని, ఇక్కడి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక 29న నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
తగ్గిన పోలింగ్ శాతం
2014 మున్సిపోల్స్తో పోలిస్తే ఈ సారి పోలింగ్ పర్సంటేజీ తగ్గిందని నాగిరెడ్డి చెప్పారు. 2014లో మున్సిపాలిటీల్లో 75.82 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి 74.40 శాతం నమోదైందని, 2014లో కార్పొరేషన్లలో 60.63 శాతం నమోదైతే ఈ సారి 58.83 శాతం నమోదైందని ఆయన వివరించారు.
ఎక్స్అఫీషియో సభ్యులు నేటి సాయంత్రంలోగా ఆప్షన్స్ ఇవ్వాలి
ఎక్స్అఫీషియో సభ్యులైన రాజ్యసభ, లోక్ సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు తమ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగే మేయర్, చైర్పర్సన్ పరోక్ష ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనవచ్చని మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. అయితే వారు తమ పరిధిలోకి వచ్చే ఒక్క మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్నే ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఏ మున్సిపాలిటీలో ఓటింగ్లో పాల్గొనాలనే ఆప్షన్ వారిదేనని, ఈ ఆప్షన్ను శనివారం సాయంత్రంలోగా సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయాలని సూచించారు. ఒక ఎమ్మెల్యే పరిధిలో ఒకటి కంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్నట్లయితే ఒక్క చోటే ఓటింగ్లో పాల్గొనాలని, రాజ్యసభ సభ్యులకు పరిధి ఉండదు కాబట్టి రాష్ట్రంలో ఎక్కడైనా ఒక చోట ఓటింగ్లో పాల్గొనవచ్చని, ఎమ్మెల్సీలు తమ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో ఏదో ఒక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ను ఎంచుకోవాలని వివరించారు.