
- కోర్టులు అడిగితే ఇస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: పోలింగ్ సమయంలోని సీసీఫుటేజీని బయటపెట్టాలని, 45రోజులకుపైగా ఆ వీడియోలను ఉంచాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను కేంద్ర ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. బహిర్గతం చేయడం కుదరదని, చట్టవిరుద్ధమని స్పష్టంచేసింది. బూత్లో ఓటర్ల సీపీఫుటేజీ బయటకు ఇస్తే వారి గోప్యతకు భంగం కలుగుతుందని.. పైగా వారిపై అసాంఘిక శక్తులు దాడులు చేసే ప్రమాదమూ ఉందని శనివారం పేర్కొంది. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, సీపీఫుటేజీని బయటపెట్టాలంటూ కొన్నిరోజులుగా కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత రాహుల్గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదే క్రమంలో ఇటీవల ఎన్నికల కమిషన్.. పోలింగ్ జరిగిన 45 రోజుల్లోపు ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే, ఆయా పోలింగ్ స్టేషన్లలోని వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ వీడియోలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని, అందుకే తొలగించాలని స్పష్టంచేసింది. దీనిపైనా ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. మ్యాచ్ఫిక్సింగ్లో భాగంగానే సీపీ ఫుటేజీలను 45రోజుల్లో తొలగించాలని చూస్తున్నారని, మహారాష్ట్ర ఫుటేజీని బయటపెట్టాలన్న డిమాండ్కు ఒప్పుకోవడం లేదని శనివారం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
దీనిపై ఈసీ స్పందిస్తూ.. వివరణ ఇచ్చింది. సీసీ ఫుటేజీని బహిర్గతం చేయడం ప్రజాప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని పేర్కొంది. ఏదైనా పోలింగ్ బూత్లో ఒక పార్టీకి తక్కువ ఓట్లు పోలైతే.. సీసీఫుటేజీ ఆధారంగా ఆ పార్టీ ఓటర్లను వేధించే ప్రమాదం ఉందని తెలిపింది.