పోలింగ్ సీసీ ఫుటేజీని బయటపెట్టలేం .. రాహుల్ గాంధీ డిమాండ్కు ఎన్నికల కమిషన్ సమాధానం

పోలింగ్ సీసీ ఫుటేజీని బయటపెట్టలేం .. రాహుల్ గాంధీ  డిమాండ్కు ఎన్నికల కమిషన్ సమాధానం
  • కోర్టులు అడిగితే ఇస్తామని వెల్లడి

న్యూఢిల్లీ: పోలింగ్​ సమయంలోని సీసీఫుటేజీని బయటపెట్టాలని, 45రోజులకుపైగా ఆ వీడియోలను ఉంచాలన్న ప్రతిపక్షాల డిమాండ్​ను కేంద్ర ఎన్నికల కమిషన్​ తోసిపుచ్చింది. బహిర్గతం చేయడం కుదరదని, చట్టవిరుద్ధమని స్పష్టంచేసింది. బూత్​లో ఓటర్ల సీపీఫుటేజీ బయటకు ఇస్తే వారి గోప్యతకు భంగం కలుగుతుందని.. పైగా వారిపై అసాంఘిక శక్తులు దాడులు చేసే ప్రమాదమూ ఉందని శనివారం పేర్కొంది. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, సీపీఫుటేజీని బయటపెట్టాలంటూ కొన్నిరోజులుగా కాంగ్రెస్​ లోక్​సభ పక్ష నేత రాహుల్​గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు డిమాండ్​ చేస్తున్నారు. 

ఇదే క్రమంలో ఇటీవల ఎన్నికల కమిషన్​.. పోలింగ్​ జరిగిన 45 రోజుల్లోపు ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే, ఆయా పోలింగ్​ స్టేషన్లలోని వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ వీడియోలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని, అందుకే తొలగించాలని స్పష్టంచేసింది. దీనిపైనా ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. మ్యాచ్​ఫిక్సింగ్​లో భాగంగానే సీపీ ఫుటేజీలను 45రోజుల్లో తొలగించాలని చూస్తున్నారని, మహారాష్ట్ర ఫుటేజీని బయటపెట్టాలన్న డిమాండ్​కు ఒప్పుకోవడం లేదని శనివారం రాహుల్​ గాంధీ ఎక్స్​ వేదికగా మండిపడ్డారు. 

దీనిపై ఈసీ స్పందిస్తూ.. వివరణ ఇచ్చింది.  సీసీ ఫుటేజీని బహిర్గతం చేయడం ప్రజాప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని పేర్కొంది. ఏదైనా పోలింగ్​ బూత్​లో ఒక   పార్టీకి తక్కువ ఓట్లు పోలైతే..  సీసీఫుటేజీ ఆధారంగా ఆ  పార్టీ ఓటర్లను వేధించే ప్రమాదం ఉందని తెలిపింది.