బీహార్ తరహాలోనే.. దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్.. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..

బీహార్ తరహాలోనే..  దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్.. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..

బీహార్ లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( SIR ) కార్యక్రమంపై దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల పార్లమెంట్ లో నిరసనకు దిగాయి విపక్షాలు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ తరహాలోనే దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేపట్టాలని ఈసీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా బీహార్ లో ఓటర్ల జాబితా నుండి 35.6 లక్షల పేర్లను తొలగించే ప్రక్రియ చేపట్టింది ఈసీ. ఇప్పుడు ఇదే తరహాలో దేశవ్యాప్తంగా వెరిఫికేషన్ చేపట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బీహార్ ఎన్నికల సందర్భంగా ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఎన్నికల సంఘం చీటింగ్​కు అనుమతిస్తున్నట్లు తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ ఆరోపించారు. కర్నాటక లోక్​సభ ఎన్నికల్లో ఓ నియోజకవర్గమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. గురువారం పార్లమెంట్​ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కర్నాటకలోని ఓ లోక్​సభ నియోజకవర్గంలో మేం పరిశీలించినప్పుడు భారీ అక్రమాలు బయటపడ్డాయి. అక్కడ అర్హత లేని వేల సంఖ్యలో కొత్త ఓటర్లను జాబితాలో ఈసీ చేర్చింది. ఇది పక్కా చీటింగ్​. దీనికి సంబంధించి 100 శాతం ఆధారాలు మా దగ్గర ఉన్నాయని అన్నారు. మహారాష్ట్రలో ఇలానే అక్రమాలకు పాల్పడ్డారుని దుయ్యబట్టారు. త్వరలో జరిగే బిహార్​ ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగే అవకాశం ఉందని, అందులో భాగంగానే  ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు అర్థమవుతున్నదని రాహుల్​ అన్నారు.

రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ స్వతంత్రంగా పనిచేయడం లేదని, దేశంలో ఎన్నికలు చోరీకి గురవుతున్నాయని ఆరోపించారు. తాము వదిలిపెట్టబోమని రాహుల్ హెచ్చరించారు. దీనికి ఈసీ బదులిస్తూ.. రాహుల్​ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఓ ప్రకటనలో పేర్కొంది ఈసీ. కర్నాటకలోని సదరు నియోజకవర్గంలో అక్రమాలు జరిగి ఉంటే ఎన్నికలు జరిగిన 45 రోజుల్లో హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసే అవకాశం ఉందని... అలా పిటిషన్​ ఏమైనా ఉంటే చెప్పండి? నిరాధార  ఆరోపణలు చేయడం కరెక్ట్​ కాదని తెలిపిందని ఈసీ.