న్యూఢిల్లీ: అక్టోబర్ 21న మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లో అక్రమ నగదు లావాదేవీలను గుర్తించడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కోఆపరేటివ్ బ్యాంకులతో పాటు అన్ని బ్యాంకుల ట్రాన్సాక్షన్లపై నిఘా పెట్టనుంది. ఇందుకోసం ఐఆర్ఎస్ మాజీ అధికారులు మధు మహాజన్, పి.మురళీకుమార్ లను మహారాష్ట్రలో ప్రత్యేక అబ్జర్వర్లుగా నియమించినట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ముంబైలో మధు మహాజన్, పుణెలో మురళీకుమార్ లకు పోస్టింగ్ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్తో కలసి వీరు బ్యాంకు లావాదేవీలను మానిటర్ చేయనున్నారు. పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలు ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉండటంతో ఇలాంటి వాటిపై దృష్టి సారిస్తారు. ఎన్నికల ఖర్చుల మానిటరింగ్, ట్రాన్స్ పరెన్సీ కోసం అభ్యర్థులు సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని, ఎన్నికలకు సంబంధించిన ఖర్చులన్నీ ఆ అకౌంట్ నుంచే చేయాలని ఈసీ సూచించింది.