- అందుకు బదులుగా లిక్కర్ స్కామ్లో భారీ దోపిడీకి స్కెచ్
- కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర చేశారు
- సోదాల టైంలో ఆమె బంధువులు విధులకు ఆటంకం కలిగించారు
- వెల్లడించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ద్వారా రూ. 100 కోట్ల ముడుపులు అందినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర పన్నారని పేర్కొంది. చెల్లించిన ముడుపులకు బదులుగా భారీ మొత్తంలో లబ్ధిపొందాలని ప్లాన్ వేశారని తెలిపింది. హోల్ సేలర్స్ నుంచి కిక్ బ్యాక్ రూపంలో నిరంతరం అక్రమ నిధులు ఆమ్ ఆద్మీపార్టీకి వెళ్లాయని పేర్కొంది.
ఈ మేరకు సోమవారం ఈడీ కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు జరిపామని, అనంతరం ఆమెను అరెస్టు చేశామని తెలిపింది. మరుసటిరోజు కవితను స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. 7 రోజుల పాటు (ఈ నెల 23 వరకు) తమ కస్టడీకి కోర్టు అప్పగించిందని ఈడీ పేర్కొంది. కవిత ఇంట్లో సోదాలు జరుపుతున్నప్పుడు తమ విధులకు ఆమె బంధువులు, సన్నిహితులు ఆటంకం కలిగించారని వెల్లడించింది.
రూ. 128.79 కోట్లు సీజ్ చేశాం
లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, హైదరా బాద్, చెన్నై, ముంబై సహా దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. ఆప్ కు చెందిన మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు మొత్తం 15 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. రూ. 128.79 కోట్లు సీజ్ చేశామని స్పష్టం చేసింది. ఈ కేసులో ఒక ప్రాసిక్యూషన్(నేరారోపణ), 5 సప్లమెంటరీ కంప్లైట్స్ ను దాఖలు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో ఇంకా తదుపరి విచారణ కొనసాగుతున్నదని తెలిపింది.