హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ సిటికీ చెందిన కింగ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు ఈనెల 13న హైదరాబాద్,పరిసర ప్రాంతాల్లో కలిపి ఏడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఫెమా చట్టం ఉల్లంఘనలపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్టు ఈడీ అధికారులు తెలిపారు. సోదాల్లో భాగంగా డిజిటల్ డివైజ్లు, రూ.76.5 లక్షల నగదు, రూ.1.5 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
అదేవిధంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు వారు వెల్లడించారు. కాగా, కింగ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన మహ్మద్ షానవాజ్, మహ్మద్ జుబేరుద్దీన్, మరికొందరితో కలిసి నిబంధనలకు విరుద్ధంగా యూకే, యూఏఈ సహా విదేశాలకు నిధులుతరలించినట్టు వచ్చిన ఆరోపణలపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
