ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హీరానందని గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ నిరంజన్ హిరానందని, అతని కుమారుడు దర్శన్లకు 2024 ఫిబ్రవరి 23న సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 26 (సోమవారం)న విచారణకు తమ ముందు హాజరు కావాలని కేంద్ర ఏజెన్సీ సంస్థ ఆదేశించింది.
హీరానందానీ గ్రూప్కు చెందిన పలు కార్యాలయాలపై ఫిబ్రవరి 22 గురువారం ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై పొవాయ్లోని హీరానందానీ గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు ముంబైలోని మూడు కార్యాలయాలు, రాయగఢ్కు ఆనుకుని ఉన్న పలు కార్యాలయాలలో సోదాలు చేశారు.
సోదాల సమయంలో ఈడీ అధికారులు హీరానందానీ గ్రూప్కు చెందిన పత్రాలు, ఫైనాన్స్లు, అమ్మకాల లావాదేవీల ఇ-రికార్డ్లను స్కాన్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. 40 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న హీరానందని గ్రూప్ దేశంలోనే అత్యంత ప్రీమియం రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటి.