ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలోని కేజీబీవీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి వీ 6లో ప్రచురించిన కథనానికి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. జిల్లా అధికారులపై విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపం, అధికారుల తీరును ఉన్నతాధికారులు తప్పుబట్టారు. స్పెషల్ ఆఫీసర్ జయశ్రీతో పాటు 5గురు వంట సిబ్బందిని శాశ్వతంగా తొలగించారు.
ఆదివారం రాత్రి భోజనం చేసిన 25 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలతో బాధపడగా వీరిని కూడా రిమ్స్కు తరలించారు. సోమవారం ఉదయం టిఫిన్ చేశాక మరో ఆరుగురి పరిస్థితి బాగా లేకపోవడంతో రిమ్స్లో అడ్మిట్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ లీడర్లు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. డీఈఓ ప్రణీత పాఠశాలకు చేరుకుని ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఈఓ, ఎస్ఓ సమక్షంలో సిబ్బంది వంట చేయగా బియ్యం, పప్పులో పురుగులు కనిపించాయి. దీంతో మరోసారి స్టూడెంట్లు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగగా, సెక్టోరియల్ ఆఫీసర్ జయశ్రీని, ఐదుగురు వంట మనుషులను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. ఇప్పుడు ఉన్నతాధికారుల దృష్టి సారించడంతో వంట సిబ్బందిని తొలగించారు.