బీచ్లో ఈతకొడుతున్న వ్యక్తిని మింగేసిన సొరచేప

బీచ్లో ఈతకొడుతున్న వ్యక్తిని మింగేసిన సొరచేప

ఈజిప్టులోని ఓ బీచ్లో షాకింగ్ ఘటన జరిగింది.  హుర్గడా రిసార్టు బీచ్ లో స్విమ్మింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని సొర చేప చంపి తినేసింది. ఈజిప్టులోని ఎర్ర సముద్రంలో  ఈ దుర్ఘటన జరిగింది. 

రష్యాకు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్ట్  సందర్శనకు వెళ్లాడు.  ఎర్ర సముద్రం తీరంలోని రిసార్ట్ ‌లో బస చేశాడు. ఆ తర్వాత ప్రియురాలితో కలిసి బీచ్ ‌లో సరదాగా ఈత కొడుతున్నాడు. ఈ సమయంలో ఓ టైగర్‌ సొర చేప  ఆ బీచ్ ‌లో కనిపించింది.  సముంద్రంలో స్విమ్మింగ్ చేస్తున్న యువకుడిపై దాడి చేసింది.  కాపాడండి..కాపాడండి అంటూ కేకలు వేశాడు. ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేందుకు ప్రయత్నం చేశాడు. కానీ సొర అతన్ని చంపేందుకు పలుమార్లు దాడి చేసింది. చివరకు షార్క్ పొపోవ్ ను మింగేసింది.  ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది

కళ్లముందే  23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ ను షార్క్ చేప తినేయడంపై అతను  తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు.  షార్క్ దాడిని ప్రత్యక్షంగా చూసిన ఇతర పర్యాటకులు భయంతో వణికిపోయారు. రిసార్ట్‌ సిబ్బంది ఆ యువకుడ్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ సంఘటన నేపథ్యంలో పర్యాటకులు బీచ్‌ వద్దకు వెళ్లవద్దని.. నీటిలోకి దిగవద్దని హెచ్చరించారు. 

20 సెకన్లలో తినేసింది..

బీచ్ లో సరదాగా గడిపేందుకు వచ్చామని..ఆ సమయంలో తన కొడుకుపై షార్క్ చేప అటాక్ చేసిందని మృతుడి తండ్రి తెలిపాడు. కేవలం 20 సెకండ్లలోనే ఆ షార్క్ చేప తన కొడుకును చంపి తినేసిందన్నాడు. పోపోవ్ ను నోటకరుచుకుని నీళ్లలోకి తీసుకువెళ్లిందని కంటతడి పెట్టాడు.  

దొరికిన సొర చేప..

యువకుడ్ని తినేసిన షార్క్ను ఈజిప్ట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ పట్టుకుంది. అయితే అప్పటికే అతన్ని సొర పూర్తిగా తినేసిందని వెల్లడించింది. బీచ్ లో దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  నిషేధిత బీచ్‌లలో ఈతకు దిగవద్దని పర్యాటకులను కోరింది.