ఖిల్లాగణపురం, వెలుగు : అడవి ఆముదం కాయలు తిని ఎనిమిది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఖిల్లాగణపురంలోని ఎస్సీ కాలనీకి చెందిన నందిని, యశ్వంత్, నయని, కిశోర్, ఆనంద్, హిమాన్షు, రజిత, రక్షిత అనే చిన్నారులు ఆదివారం మణెమ్మ అనే మహిళ ఇంటి వెనుక ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అడవి ఆముదంకాయలు తెంపుకుని తిన్నారు.
కొంతసేపటి తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు ఖిల్లాగణపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారులను ప్రశ్నించగా.. ఆముదం కాయలు తిన్నట్లు చెప్పడంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్కు తరలించారు. కాగా, పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
