చేగుంటలో చేతబడి చేశారన్న అనుమానంతో .. చెప్పులు మెడలో వేసిన గ్రామస్తులు

చేగుంటలో చేతబడి చేశారన్న అనుమానంతో .. చెప్పులు మెడలో వేసిన గ్రామస్తులు

చేగుంట(నాగర్​ కర్నూల్), వెలుగు: చేతబడి చేశారన్న అనుమానంతో ఓ వృద్దుడి మెడలో చెప్పులు వేసి కమ్యూనిటీ హాల్​లో బంధించడానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. తిమ్మాజీపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. అతడికి వరుసకు బంధువయ్యే గడ్డం కృష్ణయ్య(80) తాను బాగు చేయిస్తానని మాటిచ్చాడు. ఆ తరువాత ఆయన పట్టించుకోకపోవడంతో అనారోగ్యానికి గురైన వ్యక్తి బిజినేపల్లిలో గద్దె చెప్పించుకున్నాడు. 

అక్కడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చేతబడి చేశాడని చెప్పడంతో, కృష్ణయ్యపై అనుమానం పెంచుకున్నాడు. రెండు, మూడు రోజులుగా కృష్ణయ్య గ్రామంలో లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. శనివారం సాయంత్రం తిమ్మాజీపేట సమీపంలో కనిపించడంతో గ్రామానికి తీసుకువచ్చి కృష్ణయ్య మెడలో ఎడమ కాలి చెప్పులు వేసి కమ్యూనిటీ హాల్​లో బంధించడానికి యత్నిచంగా కుల పెద్దలు జోక్యం చేసుకొని విడిపించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తిమ్మాజీపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి తెలిపారు.