5 రాష్ట్రాల్లో ఉధృతంగా ఎన్నికల ప్రచారం

5 రాష్ట్రాల్లో ఉధృతంగా ఎన్నికల ప్రచారం
  • నేతల సుడిగాలి పర్యటనలు
  • పతాక స్థాయిలో నాయకులు, కార్యకర్తల ప్రచారం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ లలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. 3 రోజులు పంజాబ్ ను చుట్టేశారు అర్వింద్ కేజ్రీవాల్. రేపట్నుంచి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. పంజాబ్ కాంగ్రెస్ లో సీఎం చన్నీ-పీసీసీ చీఫ్ సిద్ధుల మధ్య గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. ఉత్తరాఖండ్ లో స్టూడెంట్స్ కు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. 

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ అందరినీ పర్మినెంట్ చేస్తామన్నారు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్. వారికి  సీవర్ క్లీనింగ్ మషీన్స్ అందిస్తామన్నారు. అలాగే ఎస్సీ పిల్లలందరికీ మంచి విద్య అందిస్తామన్నారు. మూడోరోజు పంజాబ్ లో పర్యటించిన కేజ్రీవాల్... అమృత్ సర్ లో రామ్ తీరథ్ ఆలయంలో పూజలు చేశారు. కాంగ్రెస్ నేత లాలీ మజీతియా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. మజీతా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని ఆప్ తెలిపింది. 

పంజాబ్ కాంగ్రెస్ లో సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిధుల మధ్య అస్సలు పడడంలేదు. ఎవరిదారి వారిదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికివారుగానే ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా కలసి కనిపించడంలేదు. సిద్ధుతో కలసి పనిచేస్తానంటున్నారు చరణ్ జిత్ సింగ్ చన్నీ. కానీ అదెక్కడా కనబడడంలేదు. ఒకరిపై ఒకరు సెటైర్లేసుకుంటున్నారు. పోలీసులపై సిద్ధు ఈ మధ్య చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు చన్నీ. పంజాబ్ పోలీసులను చూస్తే నేరస్తుల ప్యాంట్లు తడిచిపోతాయన్నారు. 
అసత్యాలు, భయంతో కూడిన రాజకీయాలు పంజాబ్ ను నిలబెట్టలేవన్నారు నవ్ జోత్ సింగ్ సిద్ధు. బెదిరింపులు పనిచేయవన్నారు. కేజ్రీవాల్ శాంతి ర్యాలీ అంతా ఫార్స్ అన్నారు. ఢిల్లీని కేజ్రీ అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఢిల్లీలో అల్లర్లు జరినప్పుడు కేజ్రీ వెన్ను చూపించారన్నారు సిద్ధు.

ఉత్తరాఖండ్ లో కొత్త పథకం ప్రారంభించారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. టెన్త్, ట్వల్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ కు మొబైల్స్, ట్యాబ్స్ ఇచ్చారు. రాష్ట్రంలోని 2 లక్షల 65వేల మంది స్టూడెంట్స్ కు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. నేరుగా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వలేని స్టూడెంట్స్ కు బ్యాంక్ అకౌంట్ లో 12వేల జమచేయనున్నట్టు తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ లో ప్రచారం కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. రాంపూర్ లో ప్రచారం చేసిన యోగి... గత సమాజ్ వాదీ ప్రభుత్వం... దళితులు, పేదలను అణగదొక్కిందన్నారు. పేదల భూములను లాక్కున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం భూకబ్జాలను విడిపిస్తుందని... బుల్డోజర్లను తిప్పడానికి కూడా వెనకాడబోమన్నారు యోగి ఆదిత్యానాథ్. 
ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల టైమ్ దగ్గరపడుతున్న కొద్ది ఎఫర్ట్స్ మరింత పెంచుతోంది బీజేపీ. అవధ్ ప్రాంతంలో గుజరాత్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు  డోర్ టు డోర్ ప్రచారం సాగిస్తున్నారు. అవధ్ ప్రాంతంలోని 82కు 82 సీట్లు గెలవాలని పట్టుదలగా ఉంది బీజేపీ.