హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లఘించరంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో అనుమతిని వెనక్కి తీసుకున్నట్లుగా ఈసీ ప్రకటించింది.
వెంటనే రైతుబంధు నిధుల విడుదల ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నవంబర్28లోపు రైతుబంధు నగదును పంపిణీ చేసుకోవచ్చునని చెప్పిన ఈసీ ఇప్పుడు వెనక్కి తీసుకోమని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
రైతబంధు ఉపసంహరణకు ఈసీ క్లారిటీ ఇచ్చింది. రైతు బంధు డబ్బులు.. రైతు ఖాతాల్లో పడతాయని.. నవంబర్ 28వ తేదీ టింగ్ టింగ్ అంటూ రైతుల ఫోన్లకు మెసేజ్ లు వస్తాయని.. ఇది బీఆర్ఎస్ పార్టీ.. సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అవుతుందంటూ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట ఎన్నికల సభలో వ్యాఖ్యలు చేశారు.
రైతు బంధును ఎన్నికల ప్రచారంగా వాడుకోవటంపై అభ్యంతరాలు రావటంతో.. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలను పరిశీలించిన ఎలక్షన్ కమిషన్.. రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ చేసింది. హరీశ్ రావు వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది.. అందుకే రైతు బంధు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది ఈసీ..
ఈసీ నిర్ణయంతో రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీవ్ర నిరాశ ఎదురైనట్టయింది. కాగా ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు విడుతల్లో ఈ అర్థిక సహయాన్ని అందిస్తుంది.