- క్యాంపు రాజకీయాలకు చెక్పెట్టేలా వెంటనే ప్రక్రియ
- 25న రిజల్ట్ తర్వాత నోటీసివ్వనున్న ఈసీ
- 26న రిపబ్లిక్డే ఉండటంతో ఆ మరునాడు ఎన్నిక
- కరీంనగర్కు 28న మేయర్, డిప్యూటీ మేయర్ ఎలక్షన్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ చైర్ పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్ల ఎన్నిక 27వ తేదీన నిర్వహించనున్నారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పోలింగ్ బుధవారం ముగియగా.. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే శుక్రవారం రోజున నిర్వహిస్తారు. 25న ఓట్ల లెక్కింపు, రిజల్ట్స్ ప్రకటన తర్వాత.. మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్ పర్సన్, ఎక్స్ అఫీషియో మెంబర్ల ఎన్నికకు సంబంధించి ఫామ్-2, 3 లను జారీ చేస్తారు. మున్సిపల్ కౌన్సిల్ను సమావేశపర్చి గెలిచిన కౌన్సిలర్లు/కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత మేయర్, చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ చేపడతారు. ఎన్నికైన వారిలో ఒక మెంబర్ మేయర్/ చైర్ పర్సన్ క్యాండిడేట్ను ప్రతిపాదించాలి, మరో మెంబర్ మద్దతు ఇవ్వాలి. పోటీలో ఒకరే ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఎక్కువ మంది ఉంటే చేతులెత్తే ప్రక్రియలో ఓటింగ్ నిర్వహించి విజేతను ప్రకటిస్తారు. ఆ రోజు ఎన్నిక నిర్వహించేందుకు అవకాశం లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, ఎక్స్ అఫీషియో మెంబర్ల ఎన్నికకూ ఇదే పద్ధతి పాటిస్తారు.
క్యాంపు రాజకీయాలకు చెక్ పెట్టేలా..
మున్సిపల్ ఎలక్షన్ల రిజల్ట్ ప్రకటించిన తర్వాతి రోజే మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్, వైస్ చైర్ పర్సన్, ఎక్స్ అఫీషియో మెంబర్ల ఎన్నిక నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. 25న రిజల్ట్ ఉంది. ఆ మరుసటిరోజు 26నే రిపబ్లిక్ డే కావడంతో 27వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. దీనివల్ల క్యాంపు రాజకీయాలకు తెరపడుతుందని పేర్కొన్నారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్ రిజల్ట్ 27న ఉండటంతో.. 28నే మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పూర్తిచేస్తామని వెల్లడించారు.