న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 7న మూడో దశ పోలింగ్ జరగనున్నది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 ఎంపీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో 2 , గుజరాత్ 26, చత్తీస్గఢ్ లో 7, కర్నాటకలో 14, అస్సాంలో 4, బిహార్ లో 5, మధ్యప్రదేశ్ లో 8, మహారాష్ట్రలో 11, యూపీలో 10, పశ్చిమ బెంగాల్ లో 4, జమ్మూకాశ్మీర్ లో 1, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలోని 2 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనున్నది.
థర్డ్ ఫేజ్ లో తలపడనున్న ప్రముఖులు వీళ్లే..
మూడో దశ ఎన్నికల్లో గుజరాత్లోని గాంధీనగర్నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అమిత్ షాతోపాటు శివరాజ్సింగ్ చౌహాన్ (విదిశ), జ్యోతిరాదిత్య సింధియా (గుణ), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), బసవరాజ్ బొమ్మై (హవేరీ), బద్రుద్దీన్ అజ్మల్ (ధుబ్రీ)లాంటి ప్రముఖులు ఈ విడత ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా, ఆదివారం సాయంత్రంతో 12 రాష్ట్రాలు/యూటీల్లోని 94 నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది.