సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను పీడీఎఫ్ రూపంలో అందించిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ వెబ్సైట్లో పెట్టింది. సుప్రీంకోర్టు సూచనతో బాండ్ల వివరాలను ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మరోసారి వెబ్సైట్లో వివరాలు పొందుపరిచినట్లు ఎక్స్లో ఈసీ పేర్కొంది. ఎస్బీఐ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను ఎన్నికల కమిషన్కు అందించకపోవడాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం ఎస్బీఐ తీరును తప్పుపట్టింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాల వెల్లడిపై ఈ నెల 11న తాము ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటించలేదంటూ మండిపడింది.
బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్స్ లేకపోవడంతో ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళాలు ఇచ్చిందో స్పష్టంగా తెలియడం లేదని.. బాండ్లతో ముడిపడిన అన్ని వివరాలను గతంలోనే స్పష్టం చేశామని.. అయినా ఆ సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ఫైర్ అయింది. కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం కోర్టు ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది. ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.