
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల జారీ చట్టబద్ధమైన లంచమేనని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి పది రోజుల పాటు ఎలక్టోరల్ బాండ్లను ఓపెన్ చేస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. వాటిపై చిదంబరం శనివారం ట్విట్టర్లో స్పందిస్తూ.. ఎలక్టోరల్బాండ్ల జారీ బీజేపీకి బంగారు పంటగా మారుతుందని విమర్శించారు. పాత రికార్డుల ప్రకారం.. 90 శాతం అనామక విరాళాలు బీజేపీకి చేరతాయని ఆయన ఆరోపించారు.
కాగా, రాజకీయ పార్టీలకు అందే నిధులకు సంబంధించి మరింత పారదర్శకత కోసం ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని బీజేపీ తీసుకొచ్చింది. ఈ విధానంలో నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లోక్సభ లేదా శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1% కంటే తక్కువ కాకుండా ఓట్లను పొందిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించవచ్చు.