ఐదుగురిని పొట్టనబెట్టుకున్న కరెంట్‌‌‌‌ షాక్‌.. భద్రాద్రి జిల్లాలో మహిళను కాపాడబోయి ఆమె భర్త, కొడుకు..

ఐదుగురిని పొట్టనబెట్టుకున్న కరెంట్‌‌‌‌ షాక్‌.. భద్రాద్రి జిల్లాలో మహిళను కాపాడబోయి ఆమె భర్త, కొడుకు..
  • మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో విద్యుత్‌‌‌‌ లైన్‌‌‌‌ సరిచేస్తుండగా జేఎల్‌‌‌‌ఎం..
  • ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా నేరేడుగొండలో రైతు, ములుగు జిల్లా వాజేడులో వృద్ధురాలు మృతి
  • భద్రాద్రిలో తండ్రీకొడుకు

ఇల్లెందు, వెలుగు : కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌ కొట్టిన మహిళను కాపాడబోయి ఆమె భర్త, కొడుకు మృతి చెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని ఎల్లాపురం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఏనుగు ఎర్రమ్మ బుధవారం తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటి బయటకు వచ్చింది. ఈ క్రమంలో బురద కారణంగా పట్టు తప్పడంతో అక్కడే ఉన్న దుస్తులు ఆరేసే దండెంను పట్టుకుంది. అప్పటికే కరెంట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ వైర్‌‌‌‌ తెగి దండెంకు తగలడంతో ఎర్రమ్మకు షాక్‌‌‌‌ కొట్టింది. గమనించిన ఆమె భర్త ఏనుగు నరసయ్య (55) భార్యను కాపాడే ప్రయత్నం చేయగా అతడికి కూడా షాక్‌‌‌‌ కొట్టింది. వీరి కేకలు విన్న వారి చిన్న కుమారుడు ప్రవీణ్ (30) బయటకు వచ్చి తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అతడికి కూడా షాక్‌‌‌‌ కొట్టడంతో నరసయ్య, ప్రవీణ్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోగా, ఎర్రమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను ఇల్లెందు ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు, అక్కడి నుంచి ఖమ్మం హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కొమరారం ఎస్సై నాగుల్‌‌‌‌ మీరా ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

లైన్‌‌‌‌ సరిచేస్తుండగా జేఎల్‌‌‌‌ఎం..
కొత్తగూడ, వెలుగు : విద్యుత్‌‌‌‌ లైన్‌‌‌‌ సరిచేస్తుండగా షాక్‌‌‌‌ కొట్టడంతో జూనియర్‌‌‌‌లైన్‌‌‌‌మెన్‌‌‌‌ చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌ జిల్లా గంగారంలో బుధవారం రాత్రి జరిగింది. మంచిర్యాలకు చెందిన చిలుకల ప్రవీణ్‌‌‌‌ (26) గంగారం మండలంలో జేఎల్‌‌‌‌ఎంగా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం వర్షం పడడంతో గంగారం నుంచి కోమట్లగూడం వైపు విద్యుత్‌‌‌‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానిక సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఎల్‌‌‌‌సీ తీసుకున్న ప్రవీణ్‌‌‌‌ గంగారంలోని మిషన్‌‌‌‌ భగీరథ ట్యాంక్‌‌‌‌ సమీపంలో పోల్‌‌‌‌ ఎక్కి చెక్‌‌‌‌ చేస్తున్నాడు. ఈ టైంలో సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌లోని ఆపరేటర్‌‌‌‌ విద్యుత్‌‌‌‌ ఆన్‌‌‌‌ చేయడంతో ప్రవీణ్‌‌‌‌ షాక్‌‌‌‌తో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఏఈ సురేశ్‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి తెలిపారు.

కలుపు తీస్తుండగా తీగలు తగిలి రైతు..
ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా నేరడిగొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన సాబ్లే సుభాష్​ (35) తనకు ఉన్న 24 గుంటలతో పాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగా బుధవారం తన పొలంలో కలుపు తీస్తున్నాడు. ఈ క్రమంలో కిందికి వేలాడుతున్న విద్యుత్‌‌‌‌ తీగలు తగలడంతో షాక్‌‌‌‌ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌‌‌‌ తెలిపారు. అలాగే ములుగు జిల్లా వాజేడు మండలంలో విద్యుత్‌‌‌‌ షాక్‌‌‌‌తో ఓ వృద్ధురాలు చనిపోయింది. మండలంలోని చెరుకూరు చెందిన బండి రాజమ్మ (65) మోతుకులగూడెంలోని తమ సొంత పొలంలో చింత చెట్టు కొమ్మ నరుకుతోంది. ఈ క్రమంలో కొమ్మ విరిగి విద్యుత్‌‌‌‌ తీగలపై పడడంతో అవి తెగి రాజమ్మపై పడ్డాయి. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమెతో పాటు నాలుగు మూగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయి.