న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనల మధ్యే విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ సోమవారం లోక్సభలో ఎలక్ట్రిసిటీ(సవరణ) బిల్లు 2022ను ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో ఈ బిల్లుపై విస్తృతంగా చర్చించేందుకు వీలుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ)కి పంపుతున్నట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మరోవైపు ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు.
సభలో ప్రతిపక్షాల ఆందోళన
కమ్యూనికేషన్ మాదిరిగానే విద్యుత్ను ప్రైవేటుపరం చేసేందుకు అనుమతించేదే ఈ బిల్లు. ఇది పార్లమెంట్ ఆమోదం పొందితే కస్టమర్లు తమకు నచ్చిన విద్యుత్ సప్లయర్ను ఎంచుకునే వీలుంటుంది. ఇందుకుగానూ విద్యుత్ చట్టంలోని సెక్షన్42, సెక్షన్ 14, సెక్షన్ 62, సెక్షన్ 166, సెక్షన్ 146, సెక్షన్ 152లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిని లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ సభ్యులు మనీశ్ తివారీ, అధిర్ రంజన్ చౌధురి, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్, సీపీఎం ఎంఏ ఆరిఫ్, టీఎంసీ సభ్యుడు సౌగతరాయ్, డీఎంకే లీడర్ టీఆర్ బాలు తదితరులు ఈ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ప్రేమచంద్రన్ అన్నారు. ఒకే ఏరియాలో ఎక్కువ ప్రైవేట్ కంపెనీలు విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుందని, ఇది లాభాలను ప్రైవేటుపరం చేసేందుకు, నష్టాలను జాతీయం చేసేందుకు దారి తీస్తుందని మనీశ్ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ పంపిణీలో కేంద్రం పాత్రను తగ్గించుకునేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. తమిళనాడు ప్రభుత్వం కొన్నేండ్లుగా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తోందని, ఈ బిల్లు వల్ల పేద రైతులపై భారం పడుతుందని టీఆర్ బాలు అన్నారు.
ప్రతిపక్షాలది రాద్ధాంతం: కేంద్రం
ప్రతిపక్షాలు అనవసరంగా ఈ బిల్లుపై రాద్ధాంతం చేస్తున్నాయని, లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ కౌంటర్ ఇచ్చారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్పై ఎలాంటి ప్రభావం ఉండదని, వారికి ఇచ్చే సబ్సిడీని ఎత్తేసే అవకాశంలేదని చెప్పారు. ఈ బిల్లుపై విస్తృతంగా చర్చించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి కామెంట్లతో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రతిపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో ఈ బిల్లుపై సంప్రదింపులకు వీలుగా స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు
విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని రాష్ట్రాల్లో పవర్ సెక్టార్ ఉద్యోగు లు, ఇంజనీర్లు ఆందోళనకు దిగారు. ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీలన్నీ ఈ బిల్లుతో రద్దవుతాయ ని ఆలిండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరే షన్ ఆరోపించింది. పేదలే కాకుండా విద్యుత్ ఉద్యోగులకూ ఇబ్బందేనని ఆందోళన వ్యక్తంచేసింది.