సింగూర్ లో ఎమర్జెన్సీ పంపింగ్... వానలు కురవకపోతే 2 నెలలకే సరిపోతయ్

సింగూర్ లో ఎమర్జెన్సీ పంపింగ్...  వానలు కురవకపోతే 2 నెలలకే సరిపోతయ్
  • జూన్​1 నుంచి షురూ 
  •     పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు 
  •     ఉన్నవి 5.477 టీఎంసీలే  
  •     70 ఎంజీడీల చొప్పున నీటి సరఫరా 
  •     డెడ్​ స్టోరేజీకి చేరువలో నీళ్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న ప్రధాన జలాశయాల్లో ఒకటైన సింగూరు రిజర్వాయర్​లో నీటి మట్టాలు పడిపోయాయి. దీంతో అధికారులు ఎమర్జెన్సీ పంపింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి పంపింగ్ ప్రారంభమవుతుందని వాటర్ బోర్డు అధికారులు ప్రకటించగా, దీనిపై శుక్రవారం బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆరా తీశారు. పటాన్​చెరు ట్రాన్స్​మిషన్​డివిజన్– -2 పరిధిలో జరుగుతున్న ఎమర్జెన్సీ పంప్​సెట్ అలైన్​మెంట్ పనులను ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. రిజర్వాయర్​పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.477 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గ్రేటర్ తాగునీటి అవసరాలకు వివిధ రిజర్వాయర్ల నుంచి రోజూ 560 ఎంజీడీలు తీసుకువస్తుండగా, సింగూరు నుంచే 70 ఎంజీడీలు సరఫరా అవుతున్నాయి. 

ప్రస్తుతం ఉన్నయ్ ​5 టీఎంసీలే..

రిజర్వాయర్​ను రిపేర్​చేయాల్సి ఉందన్న కారణంతో ఇరిగేషన్​అధికారులు ఆరు నెలల కిందటే నీటిని ఖాళీ చేశారు. అప్పుడు 20 టీఎంసీలు ఉండగా 15 టీఎంసీలు బయటకు వదిలిపెట్టారు. కానీ, ఇప్పటివరకు రిపేర్లే మొదలుపెట్టలేదు.  ప్రస్తుతం సింగూరులో 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఇవి డెడ్​స్టోరేజీకి (3 టీఎంసీలు) చేరుకోబోతున్నాయి. ఉన్న నీళ్లు కూడా 60 రోజులకు మాత్రమే సరిపోతాయని, జూన్ లో వర్షాలు పడకపోతే నగరానికి తాగునీటి కటకట తప్పదని అధికారులు అంటున్నారు. 

ఎక్కడెక్కడి నుంచి ఎంత వస్తున్నయ్​

నగరానికి ప్రస్తుతం ఉస్మాన్​సాగర్​ నుంచి 23 ఎంజీడీలు, హిమాయత్​ సాగర్​ నుంచి 11 , మంజీరా నుంచి 40, నాగార్జునసాగర్​ నుంచి 275 , ఎల్లంపల్లి  నుంచి 163 ఎంజీడీల నీటిని తీసుకువస్తున్నారు. మొత్తంగా కోర్​అర్బన్​ రీజియన్​(క్యూర్​)పరిధిలో నీటి అవసరాలకు 800 ఎంజీడీల డిమాండ్​ఉండగా 560 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. మరో 240 ఎంజీడీల కొరత ఉంది. జూన్​లో భారీ వర్షాలు పడకపోతే సింగూరు నుంచి వచ్చే 70 ఎంజీడీలు ఆగిపోతాయి. దీనివల్ల  నీటి కొరత 310 ఎంజీడీలకు చేరుతుంది. దీంతో నగరానికి నీటి కష్టాలు పెరిగే అవకాశం ఉంటుంది.

అసలేంటీ ఎమెర్జెన్సీ పంపింగ్..? 

సాధారణంగా జలాశయాల్లోని రా వాటర్​ను పక్కనే నిర్మించిన ఇంటెక్​ వెల్​లోకి నేరుగా గ్రావిటీ ద్వారా తరలిస్తారు. అక్కడి నుంచి ట్రీట్​మెంట్​ప్లాంట్​కు నీరు వెళ్తుంది. అక్కడ ట్రీట్​చేసిన నీటిని పైప్​లైన్​ల ద్వారా నగరానికి తరలిస్తారు. అయితే జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న సమయంలో నిర్ణీత లెవెల్​వరకు మాత్రమే నీరు నేరుగా ఇంటెక్​ వెల్​లోకి వెళ్తుంది. ఇలాంటి సమయంలో అత్యవసర (ఎమెర్జెన్సీ) పంపింగ్​ అవసరం అవుతుంది. ఇంటేక్​ వెల్​కు సమీపంలోనే భారీ పైపులు, మోటార్లను బిగించి ఇంటెక్​వెల్​లోకి పంపింగ్​ చేస్తారు. ప్రస్తుతం సింగూరులో నీటి నిల్వలు తగ్గుతూ డెడ్​ స్టోరేజీకి దగ్గరవుతున్న కారణంగా మెట్రోవాటర్​బోర్డు అధికారులు అత్యవసర పంపింగ్​ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ప్రధాన జలాశయాల్లో మే 29 నాటికి నీటి నిల్వలు(టీఎంసీల్లో)

రిజర్వాయర్​                ఫుల్​కెపాసిటీ     గతేడాది        ప్రస్తుతం
ఉస్మాన్​సాగర్​              3.900                    2.673               2.825
హిమాయత్​ సాగర్​      2.967                    2.058              2.331
సింగూరు                      29.917                 16.982              5.470
మంజీరా                       1.500                   0.758                0.370
నాగార్జున సాగర్​         312.045              135.950           152.760
ఎల్లంపల్లి                    20.175                  8.412                8.548