
జైళ్ల శాఖ డీఐజీ భాస్కర్
అచ్చంపేట, వెలుగు: జైళ్లలో శిక్ష అనుభవించి విడుదలైన వారికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ భాస్కర్ తెలిపారు. అచ్చంపేటలోని ఉప్పునుంతల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ విడుదలైన ఖైదీలు మళ్లీ నేరాల వైపు మళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలో 21 పెట్రోల్ బంకుల్లో దాదాపు 240 మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మూడు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామన్నారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంకుల్లో ఎలాంటి మోసం ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట డీఎస్పీ నరసింహులు, సీఐ రామకృష్ణ, ఎస్సై ప్రదీప్, జిల్లా జైలర్ తిరుమల్ రెడ్డి పాల్గొన్నారు.