
ఈ మధ్యే ఆస్ట్రేలియా 5 వేల ఒంటెల్ని చంపేసింది.. గుర్తుంది కదా. నీళ్ల కోసం ఇళ్లపై అవి దాడి చేస్తున్నాయన్న కారణంతో హెలికాప్టర్ల నుంచి కాల్చి చంపించింది. ఇప్పుడు అదే ఆస్ట్రేలియాలోని ఇంకో టౌన్కు మరో కష్టమొచ్చింది. ఆ టౌన్పై ఈములు దండెత్తి వస్తున్నాయట. కేవలం 1,300 మంది మాత్రమే ఉండే పశ్చిమ ఆస్ట్రేలియాలోని నానప్ టౌన్కు వాటి బెడద ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయట. ఎక్కడపడితే అక్కడ పెంటపెంట చేసేస్తున్నాయట. ఎట్లొచ్చినయో ఏమో తెల్వదుగానీ 40 దాకా ఈము పక్షులు వీధుల్లో తిరుగుతూ హల్చల్ చేస్తున్నాయట. ‘‘ఎట్లొచ్చినయో ఏమో గానీ ఈములు టౌన్లోకి వచ్చాయి. కొన్ని వీధుల్లోనే గుడ్లు పెట్టి పొదిగాయి. అవిప్పుడు పెరిగి పెద్దయ్యాయి. కూరగాయలు, పంటలపై దాడులు చేస్తున్నాయి. వీధుల్లో తిరుగుతూ హల్చల్ చేస్తున్నాయి.
టౌన్లో ఇప్పుడు పండ్లు బాగా పండుతాయి. యాపిల్స్, పీచ్లు బాగా పండే కాలం ఇది. వాటికి తోడు కూరగాయల తోటలూ ఎక్కువే ఉన్నాయి. కాబట్టి ఫుడ్ కోసమే అవి ఇక్కడికి వచ్చి ఉంటాయి’’ అని నానప్ టౌన్ కౌన్సిల్ప్రెసిడెంట్ టోనీ డీన్ చెప్పారు. ఇళ్లు, తోటల మీద దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయన్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి టౌన్లో తిరుగుతున్నాయన్నారు. పెద్ద పెద్ద సౌండ్లు చేయడం, హై ప్రెజర్ పైపులతో స్ప్రే చేయడం వంటి వాటితో ఈములను చెదరగొడుతున్నామన్నారు. అయితే, వాటిని చెదరగొట్టడంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈములను చంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైప్రెజర్ పైపుల ముందు మీ పిల్లలను నిలబెట్టి చూడండి అంటూ మండిపడ్డారు. దానిపై స్పందించిన టౌన్ పోలీసులు, ఈములను ఏం చంపట్లేదని స్పష్టం చేశారు. వాటి వల్ల డేంజర్ ఏం లేదని, కాకపోతే ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తాయని అన్నారు.