
హైదరాబాద్: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందున్న గాంధీ, అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలను అధికారులు తొలగించారు. 2011లో గాంధీ, అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. పలు రాజకీయ కారణాలతో ఇప్పటికీ ఆ విగ్రహాలను అధికారులు ఆవిష్కరించలేదు. విగ్రహాలను ఇక్కడి నుంచి తొలగించి వేరే చోట పెట్టాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. విగ్రహాలు తొలగించిన చోట వాటర్ ఫౌంటెన్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.
అసలు ఈ విగ్రహాల జోలికి ఇన్నాళ్లూ ఎందుకు పోలేదంటే..
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఈ మూడు విగ్రహాలపై14 ఏండ్లుగా వివాదం నెలకొంది. మేయర్ గేటు ముందు 2011లో అప్పటి మేయర్ బండ కార్తీకరెడ్డి ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పోటీగా, అప్పటి ప్రతిపక్ష టీడీపీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అర్ధరాత్రి ఆగమేఘాలపై వైఎస్ఆర్ విగ్రహానికి ఒకవైపు బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, మరో వైపు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అప్పట్లో దుమారం రేపింది. వైఎస్ విగ్రహం ఎత్తులో ఉండగా, ఇరువైపులా కింది భాగంలో అంబేద్కర్, గాంధీల విగ్రహాలు ఉండడంతో ప్రారంభానికి నోచుకోలేదు.
ఈ విగ్రహాలను ఇక్కడి నుంచి తరలించి, జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులోని పార్కు, మెయిన్ గేటుకు ఇరువైపులా ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ, దీనిపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వదిలేశారు. ఈ విగ్రహాల్లో వైఎస్ఆర్ విగ్రహం భారీ సైజులో ఉండటం, ఏర్పాటు చేసిన దిమ్మెకు ఇరువైపు గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయటం పట్ల అప్పట్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల యూనియన్ కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి ఈ విగ్రహాల పంచాది కొనసాగుతూనే ఉంది. వీటిని ముట్టుకుంటే మళ్లీ ఎలాంటి పరిణామాలెదురవుతాయోనన్న భయంతో ఇప్పటి వరకు ఎవరూ ఆ వివాదాన్ని పట్టించుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందున్న గాంధీ, అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలను తొలగించడం గమనార్హం.