జియోతో టెలికం రంగంలోకి ఎంట్రీ ఇవ్వడమే నా జీవితంలో అతిపెద్ద రిస్క్: ముకేష్ అంబానీ

జియోతో టెలికం రంగంలోకి ఎంట్రీ ఇవ్వడమే నా జీవితంలో అతిపెద్ద రిస్క్: ముకేష్ అంబానీ
  • మా అతిపెద్ద రిస్క్‌‌ జియోనే!
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్  ముకేశ్ అంబానీ
  • ఇండియాలో 4జీ నడవదని కొందరు అన్నారు
  • రూ. వేల కోట్ల సొంత డబ్బులను ఖర్చు చేశాం.. 
  • దేశంలో డిజిటల్ రివల్యూషన్‌‌కు జియో కారణమైంది
  • ఈ–కామర్స్‌‌, ఎడ్‌‌టెక్‌‌, ఫిన్‌‌టెక్ వంటి సర్వీస్‌‌ల గ్రోత్‌‌ను నడిపింది

న్యూఢిల్లీ: ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముకేశ్‌ అంబానీ, 2016లో రిలయన్స్ జియోతో టెలికాం రంగంలోకి తిరిగి రావడాన్ని తన జీవితంలో అతిపెద్ద రిస్క్‌‌గా అభివర్ణించారు. ‘‘4జీ మొబైల్ నెట్‌‌వర్క్‌‌ను అందుబాటులోకి తేవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అప్పుడు కొందరు ఎనలిస్టులు భారత్ అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీకి సిద్ధంగా లేదని, ఆర్థికంగా ఇది లాభదాయకం కాదని అన్నారు” అని మెకెన్సీ అండ్‌‌ కోతో ఇంటర్వ్యూలో అంబానీ పేర్కొన్నారు.

‘వరస్ట్ కేస్‌‌లో మనం పెద్దగా లాభపడకపోవచ్చు.  మన సొంత డబ్బు కాబట్టి ఏం పర్వాలేదు. కానీ, ఇండియాలో  మనం చేసే అత్యుత్తమ దాతృత్వంగా ఇది నిలిచిపోతుంది. దేశాన్ని డిజిటలైజ్ చేసి, పూర్తిగా మారుస్తాం’ అని కంపెనీ బోర్డుకి వివరించానని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. కాగా, 2016లో లాంచ్ అయినప్పటి నుంచి జియో ఉచిత వాయిస్ కాల్స్, చాలా తక్కువ ధరల డేటా అందించి భారత టెలికాం మార్కెట్‌‌ రూపురేఖలను మార్చేసింది. దీనివల్ల ప్రత్యర్ధి కంపెనీలు  ధరలు తగ్గించాల్సి వచ్చింది. 

 జియో రాకముందు భారత్‌‌లో  ఇంటర్నెట్ చాలా ఖరీదుగా ఉండేది. చాలా మందికి అందుబాటులో లేదు. జియో ఎంట్రీతో ఇతర కంపెనీలు కూడా ధరలను తగ్గించాల్సి వచ్చింది. గ్రామీణ, టెలికం సేవలు అందని ప్రాంతాలకూ ఇంటర్నెట్ తక్కువ రేటుకే అందుబాటులోకి వచ్చింది.  ఫలితంగా ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ఇండియాలో ఇప్పుడు 80 కోట్ల ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు.  ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌‌లైన్ మార్కెట్లలో ఒకటిగా నిలిచింది.  ఈ-–కామర్స్, ఫిన్‌‌టెక్, ఎడ్‌‌టెక్, ఎంటర్‌‌టైన్‌‌మెంట్ లాంటి డిజిటల్ సర్వీసెస్ ఊపందుకున్నాయి.

అతిపెద్ద టెలికం కంపెనీ జియో..

ప్రస్తుతం జియో దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్.  47 కోట్ల మందికిపైగా సబ్‌‌స్క్రయిబర్స్ దీని సొంతం.  5జీ, క్లౌడ్, ఏఐ వంటి సర్వీస్‌‌లను అందిస్తోంది.  “నీవు ఈ ప్రపంచంలోకి ఖాళీ చేతులతో వస్తావు, ఖాళీ చేతులతో వెళ్తావు. చివరిలో  నీవు వదిలిపెట్టేది ఒక ఇన్‌‌స్టిట్యూషన్. దీన్ని నేను నమ్ముతా” అని అంబానీ అన్నారు. 

తన తండ్రి, లెజెండరీ ఇండస్ట్రియలిస్ట్ ధీరూభాయ్ అంబానీ మాటలను గుర్తు చేస్తూ, “నా తండ్రి నాతో చెప్పారు.. ‘రిలయన్స్ అనేది ఒక ప్రాసెస్. ఇది ఒక ఇన్‌‌స్టిట్యూషన్, ఇది కొనసాగాలి. నీవు, నేను ఉన్నా లేకపోయినా రిలయన్స్ నిలబడేలా చూడాలి’..  రిలయన్స్‌‌ మా తర్వాత కూడా నిలిచి ఉంటుంది. ఇది నా తండ్రికి నేనిచ్చిన వాగ్దానం. 2027లో రిలయన్స్ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటుంది. కానీ, 100 ఏళ్లు పూర్తయినా రిలయన్స్ భారత్‌‌కు, మానవాళికి సేవ చేస్తూనే ఉంటుందని నేను కాన్ఫిడెంట్‌‌గా ఉన్నాను” అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 

వరెస్ట్‌ కేస్‌ పరిస్థితుల్లో బతికగలిగితేనే.. ముందుకు

1960లు, 70లలో రిలయన్స్, లేదా 2000లు, 2020లలో రిలయన్స్‌‌ను చూస్తే, ఇప్పుడున్నది పూర్తిగా వేరే ఆర్గనైజేషన్ అని,  ప్రపంచం ప్రతి 5-–10 ఏళ్లకు మారుతుందని అంబానీ అన్నారు.  “వరస్ట్- కేస్ పరిస్థితుల్లో బతకగలమా అనేది ముఖ్యం. నీవు మొదట వరస్ట్ కేస్ గురించి ఆలోచించాలి, ఆ పరిస్థితుల్లో  బతకగలగాలి. అప్పుడే బిజినెస్‌లోనైనా, లైఫ్‌లోనైనా రిస్క్‌ తీసుకోవాలి” అని సలహా ఇచ్చారు.