రాష్ట్రంలో పోటీ పడి ప్రవేశ పరీక్షలు రాస్తున్న స్టూడెంట్లు కోర్సుల్లో చేరేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఒకప్పుడు ఓ ఊపు ఊపిన ఇంజినీరింగ్ విద్యలో చేరేందుకు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. జాబులొస్తాయో రావోనని అనుకుంటున్నారు. దీంతో కాలేజీలు, సీట్ల సంఖ్య తగ్గుతోంది. టీచర్ విద్యపైనా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎడ్సెట్, ఈసెట్, పీఈసెట్దీ ఇదే పరిస్థితి.
గతేడాది ఇంజినీరింగ్కు 68 వేల మందే
రాష్ర్టంలో ఎంసెట్, ఎడ్సెట్, ఈసెట్, లాసెట్, పీఈసెట్ లాంటి 7 ప్రవేశపరీక్షలు జరుగుతున్నాయి. ఎంసెట్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి, లాసెట్లో మూడేళ్లు, ఐదేళ్ల కోర్సులకు, పీఈసెట్కు అండర్ గ్రాడ్యుయేట్ పీఈడీ, బీపీఈడీ, పీజీఈసెట్లో ఎంటెక్, ఫార్మసీ, ఐసెట్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో ఎంసెట్, ఎడ్సెట్, ఐసెట్కు ఎక్కువ మంది హాజరవుతుంటారు. గతేడాది ఎంసెట్కు 2,03,163 మంది హాజరవగా 1,59,820 మంది క్వాలిఫై అయ్యారు. కానీ ఇంజినీరింగ్లో 68,138 మంది, ఫార్మసీలో 7,933 మందే చేరారు. ఐసెట్కు 55,191 మంది హాజరైతే 29,386 మంది, ఎడ్సెట్ను 32,330 మంది రాస్తే 17,743 మందే చేరారు. మిగతా కోర్సుల్లోనూ తక్కువ మందే చేరుతున్నారు.
ఎంప్లాయ్మెంట్ ఆధారంగానే..
ఒకప్పుడు లక్షల్లో డొనేషన్లు కట్టి ఇంజినీరింగ్ సీట్లు కొనేవారు. కానీ ఇప్పుడు మూడో వంతు సీట్లు మిగులుతున్నాయి. అప్పట్లో ఇంజినీరింగ్ చేస్తే ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పటికే లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే చాలా మంది అటువైపు వెళ్లడం లేదని తెలుస్తోంది. పరీక్షలు రాసినా ఉద్యోగావకాశాలను బట్టే చేరుతున్నట్టు స్పష్టమవుతోంది. 2018 లెక్కల ప్రకారం ఇంజినీరింగ్లో 97,134 సీట్లుంటే 68,138 మందే చేరారు. ఎడ్సెట్ లెక్కలు తీసుకుంటే2018లో 32,330 మంది పరీక్ష రాస్తే 17,743 మంది చేరారు. దాదాపు అన్ని కోర్సుల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ లా కోర్సుకు మాత్రం డిమాండ్ తగ్గలేదు. 2018లో 18,547 మంది పరీక్ష రాశారు. 3,610 సీట్లుంటే 3,435 మంది చేరారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సు కాబట్టే డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది.