
- ఆర్థిక, విధాన నిర్ణయాలపై కమిషన్ ప్రశ్నించే చాన్స్
- కంప్లీషన్ సర్టిఫికెట్, బ్యాంక్ గ్యారంటీల విడుదల, అంచనాల పెంపుపైనా ప్రశ్నలు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ తుదిదశ విచారణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో కీలక ప్రజాప్రతినిధులను కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రశ్నించనున్నారు. విచారణకు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్కు కమిషన్ మే 20న నోటీసులు పంపింది. ఈ మేరకు శుక్రవారం ఈటల రాజేందర్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ కేబినెట్లో ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలపై ఆయనను కమిషన్ ప్రశ్నించనుంది. ఇప్పటికే ప్రశ్నలను సిద్ధం చేసి పెట్టుకున్నట్టు తెలిసింది.మరోవైపు క్రాస్ ఎగ్జామినేషన్కు ముందు ఓ గంట పాటు ఈటల వివరణను కమిషన్ తీసుకోనున్నట్టు సమాచారం. నోటీసులపై స్పందననూ రికార్డ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఇప్పటికే 109 మంది విచారణ
విచారణలో భాగంగా ఇప్పటికే 109 మంది రిటైర్డ్ ఈఎన్సీలు, ఇంజనీర్లు, అధికారులు, పలువురు ప్రైవేట్ వ్యక్తుల నుంచి స్టేట్మెంట్లను జ్యుడీషియల్ కమిషన్ తీసుకున్నది. చాలా మంది అధికారులు అప్పటి ప్రభుత్వాధినేత, మంత్రి మండలి నిర్ణయాలకు తగ్గట్టుగానే వ్యవహరించామని స్పష్టం చేశారు. వారి స్టేట్మెంట్ల ఆధారంగా ఫైనల్ రిపోర్టును సిద్ధం చేసిన కమిషన్.. కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ స్టేట్మెంట్లనూ తీసుకోవాలని భావించి వారికీ నోటీసులను పంపింది.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం, బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేయడం వంటి ఆర్థికపరమైన ఉల్లంఘనలూ జరిగినట్టు అధికారుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే వాటిపై ఈటల రాజేందర్కు కమిషన్ ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
బ్యారేజీల నిర్మాణ అంచనా వ్యయాలు, వాటి ఖర్చును పెంచుతూ ఇచ్చిన రివైజ్డ్ ఎస్టిమేట్స్ తదితర అంశాలపైనా ఆయన నుంచి ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేగాకుండా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల వంటి వాటిపైనా ప్రశ్నించే అవకాశాలున్నాయి.