ఇవాళ్టి ( జూన్ 6 ) నుంచి కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ... హాజరుకానున్న ఈటల రాజేందర్​

ఇవాళ్టి ( జూన్ 6 ) నుంచి కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ... హాజరుకానున్న ఈటల రాజేందర్​
  • ఆర్థిక, విధాన నిర్ణయాలపై కమిషన్​ ప్రశ్నించే చాన్స్​
  • కంప్లీషన్​ సర్టిఫికెట్​, బ్యాంక్​ గ్యారంటీల  విడుదల, అంచనాల పెంపుపైనా ప్రశ్నలు

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ తుదిదశ విచారణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో కీలక ప్రజాప్రతినిధులను కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ ప్రశ్నించనున్నారు. విచారణకు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్​, మాజీ మంత్రులు హరీశ్​ రావు, ఈటల రాజేందర్​కు కమిషన్​ మే 20న నోటీసులు పంపింది. ఈ మేరకు శుక్రవారం ఈటల రాజేందర్​ విచారణకు హాజరు కానున్నారు.  ప్రస్తుతం ఈటల రాజేందర్​ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్​ కేబినెట్​లో ఈటల రాజేందర్​ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలపై ఆయనను కమిషన్​ ప్రశ్నించనుంది. ఇప్పటికే ప్రశ్నలను సిద్ధం చేసి పెట్టుకున్నట్టు తెలిసింది.మరోవైపు క్రాస్​ ఎగ్జామినేషన్​కు ముందు ఓ గంట పాటు ఈటల వివరణను కమిషన్​ తీసుకోనున్నట్టు సమాచారం. నోటీసులపై స్పందననూ రికార్డ్​ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

ఇప్పటికే 109 మంది విచారణ

విచారణలో భాగంగా ఇప్పటికే 109 మంది రిటైర్డ్​ ఈఎన్​సీలు, ఇంజనీర్లు, అధికారులు, పలువురు ప్రైవేట్​ వ్యక్తుల నుంచి స్టేట్​మెంట్లను జ్యుడీషియల్​ కమిషన్​ తీసుకున్నది. చాలా మంది అధికారులు అప్పటి ప్రభుత్వాధినేత, మంత్రి మండలి నిర్ణయాలకు తగ్గట్టుగానే  వ్యవహరించామని స్పష్టం చేశారు. వారి స్టేట్​మెంట్ల ఆధారంగా ఫైనల్​ రిపోర్టును సిద్ధం చేసిన కమిషన్​.. కేసీఆర్​, హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ స్టేట్​మెంట్లనూ తీసుకోవాలని భావించి వారికీ నోటీసులను పంపింది. 

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి కాకముందే కంప్లీషన్​ సర్టిఫికెట్లు ఇవ్వడం, బ్యాంక్​ గ్యారంటీలను విడుదల చేయడం వంటి ఆర్థికపరమైన ఉల్లంఘనలూ జరిగినట్టు అధికారుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే వాటిపై ఈటల రాజేందర్​కు కమిషన్​ ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. 

బ్యారేజీల నిర్మాణ అంచనా వ్యయాలు, వాటి ఖర్చును పెంచుతూ ఇచ్చిన రివైజ్డ్​ ఎస్టిమేట్స్​ తదితర అంశాలపైనా ఆయన నుంచి ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేగాకుండా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల వంటి వాటిపైనా ప్రశ్నించే అవకాశాలున్నాయి.