అరాచకంలో హిట్లర్ను మించిపోతున్న కిమ్.... 5 నిమిషాలకో స్క్రీన్షాటా.. ఇదేం సెన్సార్షిప్ రా బాబు..!

అరాచకంలో హిట్లర్ను మించిపోతున్న కిమ్.... 5 నిమిషాలకో స్క్రీన్షాటా.. ఇదేం సెన్సార్షిప్ రా బాబు..!

నిర్బంధం.. అరాచకం.. క్రూరత్వం.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పదాలు ఎవరికైనా సరిపోతాయా అంటే.. హిట్లర్ ను గుర్తు చేసుకునేవాళ్లు ఎవరైనా. కానీ అంతకు మించి నిర్బంధంతో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గడగడలాడిస్తున్నాడు. రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితేనే కాల్చిపడేసే ఆర్డర్స్ ఇచ్చే కిమ్.. తన దేశ ప్రజలపై విధిస్తున్న సెన్సార్ షిప్ చూసి ప్రపంచం నివ్వెరబోతోంది. 

ఫోన్లు, కంప్యూటర్లు కమ్యూనికేషన్ సాధనాలన్నీ మన చేతుల్లో ఉన్నట్లే ఉంటాయి కానీ.. మూడో కన్ను ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటుంది.. అంతే కాదు.. కొన్నిసార్లు మనం టైప్ చేసిన పదాలు వాటంతట అవే మారిపోయేలా.. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి ప్రభుత్వానికి నివేదిక పంపేలా ఆటోమేటెడ్ సెన్సార్షిప్ లు ఇప్పుడు ఆ దేశ ప్రజలను వెంటాడుతున్నాయి. అసలు కిమ్ ప్రభుత్వ సెన్సార్షిప్ లు ఎలా ఉంటాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సోషల్ మీడియా ప్రపంచంలో ఇదేం అరాచకం అనకమానరు.

ఉత్తర కొరియా వర్సెస్ దక్షిణ కొరియా.. ఈ రెండు దేశాల మధ్య ఉన్న గొడవ.. పాలోళ్ల పంచాయతీ. రెండు దేశాలు విడిపోయాక.. ఒకరి మొహం ఒకరు చూసుకోకూడదు అన్నట్లుగా మధ్యలో పెద్ద గోడకట్టేశారంటే వీళ్ల వైరం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే  కిమ్ జోంగ్ ఉన్ అధికారంలో ఉన్న ఉత్తర కొరియాలో దక్షిణ కొరియాకు చెందిన ప్రతీది నిషేధమే. ఆ దేశ ప్రజలు సౌత్ కొరియాతో పాటు ప్రపంచంతో సంబంధాలు లేకుండా దారుణంగా నిర్బంధిస్తోంది కిమ్ ప్రభుత్వం.

 ఆ దేశం తన పౌరులను బాహ్య ప్రపంచ వాస్తవాలకు దూరంగా ఉంచేందుకు అన్ని రకాల మీడియాలో కఠినమైన సెన్సార్‌షిప్‌ను అమలు చేస్తుంది. అయితే నార్త్ కొరియా నుంచి ఒక ఫోన్ ఇతటీవలే సరిహద్దులు దాటి బాహ్య ప్రపంచానికి దొరికింది. ఆ ఫోన్ లో ఆటో సెన్సార్షిప్ ఎలా పనిచేస్తుందో చూసి నివ్వెరపోయింది ప్రపంచం. కిమ్ ప్రభుత్వం.. పౌరుల ఫోన్లను సైతం తమ గుప్పెట్లో పెట్టుకుని ఆపరేట్ చేస్తూ ఎలా నియంత్రిస్తుందో బీబీసీ నివేదిక వెల్లడించింది. 

కిమ్ హయాంలో ప్రతి ఫోన్ పైన నిఘా, సెన్సార్‌షిప్ అమలవుతోంది. శత్రుదేశం అయిన దక్షిణ కొరియాకు సంబంధించిన పేరును, పదాలను ఉత్తరకొరియాలో వినియోగించే పరిస్థితి లేదు. ఏదైనా సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా స్పెల్లింగ్ మార్చేసుకుంటాయి ఫోన్లు. 

ALSO READ | మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్..ఓ జపనీస్ పాప్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్పెర్మ్ డొనేట్!

ఉదాహరణకు, దక్షిణ కొరియా సంస్కృతిలో బాయ్‌ఫ్రెండ్‌లను సూచించడానికి  'ఒప్పా' అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. ఉత్తర కొరియా స్మార్ట్‌ఫోన్‌లలో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా 'కామ్రేడ్'గా పడుతుంది. అంటే ఒప్పా అనే పదం సౌత్ కొరియాకు చెందినది అయినందువల్ల.. ఆ పదం బదులు కామ్రేడ్ అని పడేలా సెట్ చేశారు. 

అదేవిధంగా, ‘దక్షిణ కొరియా’ అని టైప్ చేస్తే,  ఆటోమేటిక్ గా ‘పప్పెట్ స్టేట్’ గా మారిపోతోంది. శత్రుదేశం దక్షిణ కొరియాను ఉత్తర కొరియా అధికారులు అలా చీప్ గా పిలుస్తుంటారు. అందుకే ఫోన్లలో ఆటోమేటిక్ గా మారిపోయేలా సెట్ చేశారు. అంతే కాకుండా.. అది US నియంత్రణలో ఉందని చెప్పేస్తుంది.

ఇక ప్రతి పౌరుడు ఏం చేస్తున్నాడో.. ఎవరికి మెసేజ్ చేస్తున్నాడో.. సౌత్ కొరియాతో పాటు ప్రపంచ దేశాలతో ఏమైనా సంబంధాలు పెట్టుకున్నారా లేదా అని ఎప్పటికప్పుడు స్పై (నిఘా) చేస్తుంటారు. అందుకోసం..  ఫోన్ ప్రతి ఐదు నిమిషాలకు స్క్రీన్‌షాట్‌లను తీసి, ఒక ఫోల్డర్ లో సేవ్ చేస్తుంది. అది అధికారులకు మాత్రమే ఓపెన్ అవుతుంది. దీంతో ఎ్పటికప్పడు వినియోగదారు కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. 

ఉత్తర కొరియాలో రేడియోల నుండి స్మార్ట్‌ఫోన్‌ల వరకు, కమ్యూనికేషన్ డివైజెస్ ఆ దేశానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే రిసీవ్ చేసుకునేలా కాన్ఫిగర్ సెట్ చేశారు. విదేశాల కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి ఈ డివైజెస్ లలో ఏదైనా మార్చాలనుకుంటే నేరం చేసినట్లే. అంటే సాధారణ ప్రజలు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా జరిగే సమాచారాన్ని పూర్తి స్థాయిలో యాక్సెస్ చేసే పరిస్థితి లేదు. 

ప్రపంచ సమాచారాన్ని నిషేధించడమే కాకుండా.. దక్షిణ కొరియా సంస్కృతికి గురికావడాన్ని సూచించే సంప్రదింపు పేర్లు, భాష, యాస కోసం అధికారులు మొబైల్ ఫోన్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారని చెబుతున్నారు. విదేశీ సాంస్కృతిక ప్రభావాన్ని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన కె-పాప్, కె-డ్రామాలు, దక్షిణ కొరియా సంగీతం, టెలివిజన్ నాటకాలను కూడా కిమ్ నిషేధించి పడేశాడు.

మొత్తంగా కిమ్.. నిరంకుశత్వం ప్రపంచ దేశాలతో ప్రజలకు సంబంధం లేకుండా చేయడమే కాకుండా.. ఫోన్లలో ఏం వెతకాలో.. ఏం చూడకూడదో కూడా నిషేధించే స్థాయికి వెళ్లింది. అప్పట్లో టెక్నాలజీ లేని కాలంలో హిట్లర్ నిర్బంధంలో తనను మించిన వారు లేరన్నట్లు వ్యవహరిస్తే.. టెక్నాలజీని వినియోగించి ప్రజలను బంధీలుగా చేస్తూ చుక్కలు  చూపిస్తున్నాడు కిమ్ అనే చెప్పవచ్చు.