రుణమాఫీపై పూటకో మాట: మాజీ మంత్రి హరీశ్​రావు ట్వీట్

రుణమాఫీపై పూటకో మాట: మాజీ మంత్రి హరీశ్​రావు ట్వీట్
  • మంత్రుల తీరుతో రైతుల్లో గందరగోళం
  • సీఎం సమక్షంలోనే భట్టి పచ్చి అబద్ధాలు
  • వెంటనే శ్వేతపత్రం విడుదల చేయండి
  • మాజీ మంత్రి హరీశ్​రావు ట్వీట్

హైదరాబాద్: రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ముఖ్యమంత్రేమో రుణమాఫీ పూర్తి చేసినట్లు డబ్బాకొడితే, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం రుణమాఫీ పూర్తి కాలేదంటున్నారని ట్విట్టర్​లో వీడియోను షేర్ చేశారు. ఇందులో ఏది నిజమో, ఎవరి మాటలు నమ్మాలో సీఎం చెప్పాలన్నారు. ‘మొన్న ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి 18వేల కోట్లతో రుణమాఫీ పూర్తిగా చేసినట్లు ప్రకటిస్తే, ఇందుకు భిన్నంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, ఇంకా 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామన్నరు. మరో మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి ఇంకా17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటున్నరు. ఇవాళ  సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పచ్చి అబద్దం చెప్పారు.

ఏకంగా 31వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించారు. మీరు చెబుతున్నట్లు రుణమాఫీ జరిగి ఉంటే బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాలు, కలెక్టరేట్ల చూట్టూ రైతులు ఎందుకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఎందుకు రోడ్లెక్కి రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఆందోళనలు చేస్తున్నారు. భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి మరింత గందరగోళం సృష్టిస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవాన్ని ముఖ్యమంత్రి ఒప్పుకొని రైతులకు క్షమాపణ చెప్పాలి. వెంటనే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని హరీశ్​రావు డిమాండ్​చేశారు.