
- తెలంగాణపై బాబు పెత్తనం
- ఆదిత్యానాథ్ దాస్ నియామకం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు
- నీటి పారుదల శాఖ సలహాదారు పదవి ఎందుకు కట్టబెట్టారో చెప్పాలి
- మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్: ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారుగా ఆదిత్యానాథ్ దాస్ నియామకమే ఇందుకు నిదర్శనమన్నారు. ‘ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు. చంద్రబాబు ఆదేశిస్తున్నాడు.. శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవిని లాగేస్తారన్న భయంతో చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటాడా? నాడు జలయజ్ఞం ప్రాజెక్టుల నుంచి నిన్న పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యాదాస్ది కీలకపాత్ర.
ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి ఎందుకు కట్టబెట్టారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి. తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేకిగా ముద్రపడ్డ వ్యక్తిని ఏ ప్రయోజనాల కోసం ఈ పదవిలో కూర్చోబెట్టారు? వ్యక్తిగతంగా ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన పట్ల మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు.
కానీ ఆంధ్రాకు కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించడంలో ఆయనది కీలకపాత్ర. కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపెట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనక కాంగ్రెస్ ఆలోచన ఏంటి..? తెలంగాణ ప్రాజెక్టులు, జల వనరుల మీద అపారమైన అనుభవం, అవగాహన ఉన్న ఎందరో జల నిపుణులు ఉన్నారు వారిని పక్కనపెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎంచుకోవడం వెనక కారణాలేంటి..? కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉంది. ఆదిత్యాదాస్ నాథ్ ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి తొలగించాలి’ అని నిరంజన్ రెడ్డి డిమాండ్చేశారు.