కారు దిగుతున్నరు..కాంగ్రెస్​లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్

కారు దిగుతున్నరు..కాంగ్రెస్​లో చేరిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్
  •     చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ నేతృత్వంలో హస్తం గూటికి.. ​ 
  •     అదేబాటలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్​రెడ్డి 
  •     జడ్పీటీసీలు, మాజీ సర్పంచుల చూపు హస్తం వైపే

మంచిర్యాల, వెలుగు : బీఆర్ఎస్​కు చెందిన పలువురు కీలక నేతలు కారు దిగుతున్నరు. ఎప్పటినుంచో పార్టీ మారాలని చూస్తున్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్​లోకి క్యూ కడుతున్నరు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్​వెంట నడిచినవారు అక్కడ అణిచివేతలను, అవమానాలను భరిస్తూనే ఇంతకాలం ఓపిక పట్టారు. గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్​ చేసిన అవినీతి, అక్రమాలు ఇటీవల బయటకు వస్తుండడంతో ఆ పార్టీ ప్రతిష్ట మసకబారింది. దీనికితోడు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ కు గుడ్​బై చెప్తున్నరు.

తెగిన 16 ఏండ్ల బంధం..

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా లోకల్ ​బాడీస్​ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ బీఆర్ఎస్​తో ఉన్న 16 ఏండ్ల బంధాన్ని తెంపేసుకున్నారు. కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. ఇటీవల పార్టీ సభ్యత్వానికి రిజైన్​ చేసి అదే రోజు సీఎం రేవంత్​రెడ్డిని కలవడం జిల్లాలో హాట్ టాపిక్​ అయ్యింది. తాజాగా శనివారం చెన్నూర్, బెల్లంపల్లి​ ఎమ్మెల్యేలు డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి, వినోద్, పెద్దపల్లి లోక్​సభ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ​రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్​ మున్షీ సమక్షంలో హస్తం గూటికి చేరారు.

పురాణం బీఆర్ఎస్​కు​రిజైన్​ చేసిన రోజే కోటపల్లి మండలానికి చెందిన ఆయన అనుచరులు సుమారు 50 మంది కూడా పార్టీకి గుడ్​బై చెప్పారు. వారంతా త్వరలోనే కాంగ్రెస్​లో చేరనున్నారు. 1987లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సతీశ్ ఆ పార్టీలో పలు పదవులు చేపట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో బీఆర్​ఎస్​లో చేరి కేసీఆర్​అడుగుజాడల్లో నడిచారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో మెంబర్​గా, 2010 నుంచి ఆదిలాబాద్ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.

ఆయన 2015లో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ఆరేండ్లు ఆ పదవిలో కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీ ఆశించినప్పటికీ అప్పటి చెన్నూర్​ఎమ్మెల్యే బాల్క సుమన్​అడ్డుపుల్ల వేసినట్టు ఆయన అనుచరులు ఆరోపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల టికెట్​ రేసులో ఉన్నప్పటికీ చివరకు నిరాశే ఎదురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పురాణం బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పి కాంగ్రెస్​లో చేరారు.

అదేబాటలో అరవింద్​రెడ్డి

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్​ రెడ్డి సైతం చాలాకాలంగా బీఆర్​ఎస్​లో ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్​ఎస్​లో చేరి కేసీఆర్​కు బాగా క్లోజ్​గా మెలిగారు. కోల్​బెల్ట్​ ప్రాంతంలో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​నుంచి మంచిర్యాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010 బై పోల్స్​లోనూ గెలిచారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్​లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ​టికెట్​రాకపోవడంతో మళ్లీ బీఆర్​ఎస్​లో చేరారు.

2023 ఎన్నికల్లో మంచిర్యాల టికెట్​ కోసం చివరిదాకా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అరవింద్​రెడ్డి బీఆర్​ఎస్​ను వీడుతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డితో కలిసి త్వరలోనే కాంగ్రెస్​లో చేరనున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. చెన్నూర్​ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, జడ్పీ చైర్​పర్సన్​ భాగ్యలక్ష్మి, నియోజకవర్గానికి చెందిన జడ్పీ మాజీ వైస్​ చైర్మన్​ మూల రాజిరెడ్డి గతంలోనే హస్తం గూటికి చేరారు.

ఇప్పుడు పది మందికిపైగా జడ్పీటీసీ మెంబర్లు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కాంగ్రెస్​ వైపు చూస్తున్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో జిల్లాలో కారు పార్టీ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.