- మూడో విడత విచారణ కోసం హైదరాబాద్కు వచ్చిన జస్టిస్ ఘోష్
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో భాగంగా జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్.. అధికారులు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించనున్నారు. మూడో విడత విచారణ కోసం ఆయన శుక్రవారం హైదరాబాద్కు వచ్చారు. సాయంత్రం తాజ్కృష్ణ హోటల్లో అధికారులతో జస్టిస్ ఘోష్ భేటీ అయ్యారు. అలాగే, ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
బ్యారేజీల పరిస్థితిపై ఆరా తీశారు. టెక్నికల్అంశాలపై వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. శనివారం ఉదయం ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులతో మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. వాటితోపాటు శనివారం నుంచే అఫిడవిట్లను క్షుణ్నంగా పరిశీలించేందుకు ఆస్కారం ఉన్నట్టు తెలిసింది.
ఆదివారం నుంచి అఫిడవిట్లు సమర్పించిన అధికారులతో క్రాస్ ఎగ్జామినేషన్ను మొదలు పెట్టే చాన్స్ ఉందని సమాచారం. మూడో విడత విచారణపై శనివారం జస్టిస్ ఘోష్ షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.
