న్యూఢిల్లీ: రెండు వేల నోటు ఎక్స్చేంజ్ మంగళవారం నుంచి మొదలవడంతో కొన్ని బ్యాంకుల వద్ద చిన్నపాటి క్యూలు కనిపించాయి. ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్ అవసరం లేదని ఆర్బీఐ, ఎస్బీఐలు ప్రకటించినప్పటికీ, కొన్ని బ్యాంకులు మాత్రం పాన్ లేదా ఆధార్ తప్పనిసరిగా కావాలని పట్టుబట్టాయి. రూ. 2,000 నోట్ల ఎక్స్చేంజ్కి సెప్టెంబర్ చివరిదాకా గడువు ఉంది. కొన్ని బ్యాంకులు ఎలక్ట్రానిక్ ఎంట్రీ ద్వారా నోట్లను తీసుకోగా, మరికొన్ని బ్యాంకులు ఐడీ ప్రూఫ్ అడగకపోయినా, కస్టమర్లను తమ పేరు, మొబైల్ నెంబర్లను ఇవ్వాలని కోరాయి.
మొత్తం కరెన్సీలో రూ. 2,000 నోట్లు 10.8 శాతం. విలువపరంగా రూ. 3.6 లక్షల కోట్లు. రూ. 2 వేల నోట్ల ఎక్స్చేంజ్ లేదా డిపాజిట్కు ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదని తన బ్రాంచీలన్నింటికీ ఎస్బీఐ సమాచారం పంపింది. కొటక్, హెచ్ఎస్బీసీ వంటి బ్యాంకులు తమ వద్ద అకౌంట్లు లేని వారిని ఐడీ ప్రూఫ్ ఇవ్వాలని కోరాయి. ఫార్మ్ నింపాల్సిన అవసరం లేదని నాన్ అకౌంట్ హోల్డర్లయితే మాత్రం ఏదో ఒక ఐడీ ప్రూఫ్ ఇవ్వాలని బ్యాంక్ ఆఫ్ బరోడా కోరుతోంది. ఇక ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు తమ కస్టమర్లందరూ ఫార్మ్లు నింపాలని, కస్టమర్లు కాకపోతే ఐడీ ప్రూఫ్ ఇవ్వాలని కోరుతున్నాయి.