పాలమూరు,వెలుగు: కుల వృత్తులను ఆదుకోవడంతో పాటు ఆధునికీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కొత్త అధ్యక్షుడిగా నియమితులైన సత్యనారాయణ గురువారం జిల్లాకేంద్రంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డితో కలిసి చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చామని, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. మత్స్యకారుల అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.2 కోట్లు ఇస్తే.. తెలంగాణలో 4 నుంచి 5 వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే 2000 వాహనాలు ఇచ్చామని, 11,500 మంది మత్స్యకారులకు ఆర్థిక సాయం చేశామని వెల్లడించారు. గతంలో కాంట్రాక్టర్లు మత్స్యకారుల శ్రమను దోచుకునే వారని, ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తోందని చెప్పారు. అంతకుముందు వీరన్నపేటలోని చౌడేశ్వరి దేవి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి.. తొగట క్షత్రియ కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ ర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, జిల్లా రైతుబంధు కో-ఆర్డినేటర్ గోపాల్ యాదవ్, గొర్రె కాపరుల సహకార సంఘం అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్ వెంకన్న, డీసీసీబీ ఉపాధ్యక్షులు కొరమాని వెంకటయ్య, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, ఎంపీపీ శేఖర్ రెడ్డి, ముదిరాజు సంఘం రాష్ట్ర నాయకులు మనోహర్, జిల్లా మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాధారోహిణి పాల్గొన్నారు.
అడ్వొకేట్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం
అడ్వొకేట్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా క్లబ్లో అడ్వొకేట్లకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అడ్వొకేట్ల సంక్షేమం కోసం రూ. 100 కోట్లతో నిధి ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. దీని ద్వారా ఇప్పటివరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 59 వేల మంది అడ్వొకేట్లకు మేలు జరిగిందన్నారు. బెయిల్ పోలీస్ స్టేషన్ ద్వారా కాకుండా కోర్టు ద్వారానే తీసుకోవాలని అడ్వొకేట్లు కోరుతున్నారని, ఇందుకోసం 41(ఏ) సీఆర్పీసీకి పార్లమెంట్లో సవరణలు చేయాల్సి ఉందన్నారు. ఈ విషయంలో తమ ఎంపీల మద్దతుల ఉంటుందని చెప్పారు. బార్ అసోసియేషన్ అభివృద్ధిలో భాగంగా పార్కింగ్కు స్థలం ఇచ్చామని, సరిపోకుంటే మరింత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొత్త కోర్టు భవనాలకు స్థలంతో పాటు నిధులను కూడా ఇస్తామని వెల్లడించారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, పీపీ మనోహర్ పాల్గొన్నారు.