- పెరిగిన విమాన ప్రయాణాలు
- మెరుగుపడిన కంపెనీల రెవెన్యూ
న్యూఢిల్లీ: దేశంలో విమాన ప్రయాణాలు ఊపందుకున్నాయి. కరోనా ముందు స్థాయిలను టచ్ చేస్తున్నాయి. ఏవియేషన్ సెక్టార్లో డిమాండ్ను తెలిపే ఇండికేటర్ రెవెన్యూ ప్యాసింజర్ కిలోమీటర్స్ (ఆర్పీకే) ఈ ఏడాది ఫిబ్రవరిలో కరోనా ముందు స్థాయి కంటే కేవలం 2.2 శాతం మాత్రమే తక్కువగా రికార్డయ్యింది. బిజినెస్ యాక్టివిటీ పుంజుకోవడంతో విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్లైన్ కంపెనీలు కూడా ఫుల్ కెపాసిటీతో పనిచేస్తున్నాయి. వీటి ప్యాసింజర్ లోడ్ ఫాక్టర్ (పీఎల్ఎఫ్) ఈ ఏడాది ఫిబ్రవరిలో 81.6 శాతానికి చేరుకుంది. ప్యాసింజర్లను మోసుకుపోయే కెపాసిటీని ప్యాసింజర్ లోడ్ ఫాక్టర్గా పిలుస్తున్నారు. పీఎల్ఎఫ్ ఎక్కువగా ఉన్న దేశాల్లో యూఎస్ ,చైనా, జపాన్ తర్వాత ఇండియా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) రిపోర్ట్ ప్రకారం, ఇండియా ఎయిర్లైన్ సెక్టార్లో పీఎల్ఎఫ్ జనవరిలో 85.2 శాతంగా, కిందటేడాది డిసెంబర్లో 88.9 శాతంగా, నవంబర్లో 87.9 శాతంగా రికార్డయ్యింది. దేశ ఏవియేషన్ సెక్టార్ పుంజుకుంటోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. తన రేటింగ్ను నెగెటివ్ నుంచి స్టేబుల్కు అప్గ్రేడ్ చేసింది. లోకల్గా విమాన ప్రయాణాలు చేసే వారు పెరుగుతున్నారని వెల్లడించింది. 2022–23 లో ఏవియేషన్ సెక్టార్కు రూ.11,000 కోట్ల నుంచి రూ.13,000 కోట్ల లాస్ వస్తుందని అంచనా వేసిన ఈ సంస్థ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ రూ.5 వేల కోట్ల నుంచి 7 వేల కోట్లకు తగ్గుతుందని పేర్కొంది.
15 కోట్లకు విమాన ప్రయాణాలు
దేశంలో విమాన ప్రయాణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–13 శాతం పెరిగి 15 కోట్లకు చేరుకుంటాయని ఇక్రా అంచనా వేసింది. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణాలు 55–60 శాతం పెరిగి 13.60 కోట్లకు చేరుకున్నాయి. 2019–20 లో నమోదైన 14.15 కోట్ల కంటే ఇది 4 శాతం మాత్రమే తక్కువ. మరోవైపు ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు పెరగడం, డాలర్ మారకంలో రూపాయి విలువ తగ్గడం వంటి సమస్యలను ఏవియేషన్ సెక్టార్ ఎదుర్కోంటోందని ఇక్రా వెల్లడించింది. దేశ ఏవియేషన్ సెక్టార్లో 2029–30 నాటికి 35 కోట్ల డొమెస్టిక్, 16 కోట్ల ఇంటర్నేషనల్ ప్రయాణాలు రికార్డవుతాయని కాపా ఇండియా అంచనావేస్తోంది.